రిటైర్డ్ జడ్జీతోనూ కుదర్లే.. కాకాణి లొంగిపోవాల్సిందే

అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో అందినకాడికి దోచుకున్న నేతలు… ఆ తర్వాత ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏపీలోని తాజా పరిస్థితులను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఐదేళ్ల పాటు వైసీపీ అదికారంలో సాగగా.. ఆ పార్టీ నేతలు అందిన కాడికి దండుకున్నారు. వైసీపీ అదికారం నుంచి దిగిపోగానే.. వాటిపై కేసులు నమోదు అయిపోయాయి. కొందరు నేతలు జైలుకెళ్లారు. మరికొందరు కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిళ్లు తెచ్చుకున్నారు. ఇంకొందరు అయితే అటు ముందస్తు బెయిల్ దక్కక, ఇటు పోలీసు విచారణకు హాజరయ్యే ధైర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ మూడో కోవకే చెందుతారు.

సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం కాకాణికి ఉన్న చివరి అవకాశాన్ని కూడా రద్దు చేసేసింది. మంత్రి హోదాలో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి అమ్ముకుని సొమ్ము చేసుకున్న కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కాకాణి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసుల నుంచి ఎలాగోలా రక్షణ కల్పించుకోవాల్న భావనతో కాకాణి తన తరఫున హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ శేషాద్రి నాయుడిని రంగంలోకి దించారు. అయినా కూడా కాకాణికి ఏమాత్రం ఫలితం రాలేదు.

అంతేకాకుండా ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసుల విచారణకు హాజరుకాకుండా రెండు నెలలుగా పరారీలో ఉంటూ కాకాణి ఎలా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని కోర్టు కాకాణి లాయర్లను నిలదీసింది. పోలీసుల విచారణకు సహకరించే వారికి ముందస్తు బెయిళ్లు ఇవ్వవచ్చు గానీ… నెలల తరబడి పోలీసులకు దొరక్కుండా తిరుగుతూ సాగే నేతలకు ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చేదని కూడా కోర్టు ప్రశ్నించింది. అసలు కాకాణి తరఫున బెయిల్ కోసం వాదించే అవకాశాన్ని ఆయన లాయర్లకు సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వనట్లుగా సమాచారం. ప్రతి అంశాన్ని వారి కంటే ముందే కోర్టే ప్రశ్నించిన తీరుతో శేషాద్రి నాయుడు షాకయ్యారట.

ఈ క్రమంలో బెయిల్ ఇవ్వకుంటే ఇవ్వకపోయారు… కనీసం తాము దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తాము ఉపసంహరించుకుంటామని శేషాద్రినాయుడు సుప్రీంను వేడుకున్నంత పనిచేశారట.అయితే పిటిషన్ ఉపసంహరణకు కూడా సుప్రీం బెంచ్ అనుమతించలేదు. పిటిషన్ ను కొట్టివేస్తున్నామని… వాదనలు ముగిసిన తర్వాత పిటిషన్ ను ఎలా ఉపసంహరించుకుంటారని కోర్టు వారిని నిలదీసింది. దీంతో శేషాద్రి నాయుడు అలా షాకై నిలబడిపోగా… కాకాణి పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ పరిణామం కాకాణికి పెద్ద దెబ్బేనని చెప్పక తప్పదు. అంతేకాకుండా అన్ని దారులూ మూసుకు పోయిన వేళ కాకాణి పోలీసుల ఎదుట లొంగిపోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి