వంశీ పై ముప్పేట దాడి!

రాజ‌కీయాల్లో ఒక్కో సారి నేత‌ల స్కెచ్చులు వారికే ఎదురుతిరుగుతాయ‌నేది ఎన్నో సార్లు రుజువైన రాజ‌కీయ‌త చ‌ద‌రంగం. ఎదుటి వారిని బుక్ చేసేందుకు అమ‌లు చేసే ప్లాన్ వారినే ఇబ్బంది పెట్టే ఇలాంటి ప్ర‌త్యేక‌మైన ప‌రిస్థితిని ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎదుర్కుంటున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడును టార్గెట్ చేసిన అంశంలో జ‌గ‌న్ సెల్ఫ్ గోల్ చేసుకున్నార‌ని అంటున్నారు. ఇదంతా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ కేంద్రంగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల గురించి. అక్క‌డ జగ‌న్ మాట‌నే లైట్ తీసుకుంటున్న విధానం కొత్త చ‌ర్చ‌కు కార‌ణంగా మ‌రింది.

తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ముఖ్య నేత‌లుగా గుర్తింపు పొందిన యార్లగడ్డ వెంక‌ట్రావు, దుట్టా రామ‌చంద్ర‌రావులు పార్టీ కోసం శ్ర‌మించారు. అయితే, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేర‌డంతో రాజ‌కీయం మారింది. ఆయ‌న‌తో కలిసి పని చేసేందుకు సీనియ‌ర్ వైసీపీ నేత‌లు సిద్ధంగా లేరు.

ఇప్పటికే పలుమార్లు అటు వంశీ.. ఇటు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మీడియా మీట్ పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అందర్నీ కలుపుకునే వెళ్లే శక్తి తనకుందని వంశీ చెప్పగా.. ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను వంశీ ఇబ్బందిపెట్టాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొద్దికాలం కింద‌ట‌ మరోసారి వంశీ-దుట్టా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌లే ఓ స‌మావేశం సంద‌ర్భంగా ఎమ్మెల్యే వంశీ వైసీపీ మనేత యార్ల‌గ‌డ్డ మ‌ధ్య స‌ఖ్య‌త కుదిర్చే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, ఆ ప్ర‌య‌త్నం ఫ‌లితం ఇవ్వ‌లేదు.

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీని పార్టీలో ఒంటరి చేసి తిరిగి ఇంచార్జి అవ్వాలి అని యార్లగడ్డ ఎత్తులు వేస్తున్నారు. అధినేత జగన్ చెప్పిన కలిసి పనిచేయడానికి ససేమిరా అంటున్న యార్లగడ్డ, దుట్టా వంశీకి వ్యతిరేకంగా మ‌రో నేత దాసరితో క‌లిసిపోయారు.

గ‌న్న‌వ‌రం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీని రెచ్చగొట్టే విధంగా యార్లగడ్డ, దుట్టా, దాస‌రి వర్గాలు కార్యకలాపాలు మొద‌లుపెట్టాయని స‌మ‌చారం. వంశీకి కోవిడ్ సోకిన సమయంలో వర్గ రాజకీయం చేప‌ట్టిన ఈ నేత‌లు వంశీని వైసీపీకి దగ్గర అవ్వకుండా కూటమి కట్టడం చూస్తుంటే వైసీపీలో జ‌గ‌న్ మాట‌ను సొంత పార్టీ నేత‌లే లెక్క చేయ‌డం లేదా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు తెచ్చింది.