సెంట్రల్ వర్సిటీ భూముల చదునుకు బ్రేక్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ)లో గత కొన్ని రోెజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమి తమదేనని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే వాదనతో రంగంలోకి దిగిన ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో అక్కడి భూములను చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఫలితంగా రాత్రింబవళ్లు అక్కడ బుల్డోజర్లు, ప్రొక్రెయినర్లతో అలజడి రేగింది. ఈ భూములను పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.

అయితే ఈ భూములు సెంట్రల్ వర్సిటీకి చెందినవని, వీటిలో సెంటు భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వానిది లేదని విద్యార్థులతో పాటు పలు ప్రజా సంఘాలు, విపక్షాలు వాదిస్తున్నాయి. అయితే ఈ వాదనలను తిప్పికొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో 2004లోనే ఈ భూములు వర్సిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు జరిగిందని… ఈ భూములకు బదులుగా వర్సిటీకి గోపనపల్లిలో అంతే స్థాయిలో భూములను ఇచ్చారని కూడా రాష్ట్ర ప్ఱభుత్వం గుర్తు చేసింది. భూమి చదును కార్యక్రమాలు మరింత ముమ్మరం కాగా… పలు ప్రజా సంఘాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. వివాదం తేలకుండానే ప్రభుత్వం బలవంతంగా భూములను స్వాధీనం చేసుకుంటోందని, ప్రభుత్వ బల ప్రయోగాన్ని నిలువరించాలని వారు కోర్టు కోరారు.

ఈ పిటిషన్లను బుధవారం విచారించిన తెలంగాణ హైకోర్టు… విచారణను బుధవారమే పూర్తి చేయలేకపోయింది. మిగిలిన విచారణను గురువారం చేపడతామంటూ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ విచారణ పూర్తి అయ్యేదాకా సెంట్రల్ వర్సిటీ భూముల చదును కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా రెండు, మూడు రోజులుగా జోరుగా కొనసాగుతున్న వర్సిటీ భూముల చదునుకు బ్రేకులు పడినట్టు అయ్యింది. గురువారం హైకోర్టు విచారణ పూర్తి అయి కోర్టు నుంచి తీర్పు వచ్చేదాకా ఈ పనులు నిలిచిపోతాయి. కోర్టు తీర్పు తర్వాత… తీర్పు ప్రకారం అక్కడ చదును జరుగుతుందా? లేదా? అన్నది తేలనుంది.