కాలుష్య నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా

దేశరాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏ స్ధాయిలో ఉంటుందో కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఒకదశలో సొంత వాహానాల్లో తిరిగే వారిని మినహాయిస్తే బస్సులు, ఆటోలు, నడిచివెళ్ళే వాళ్ళ మినహా మిగిలిన అందరికీ నరకంలో ప్రయాణిస్తున్నట్లే ఉంటుంది. ప్రధానంగా బడికి వెళ్ళే పిల్లల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. అందుకే ఓ దశలో బడిపిల్లలు మొహాలకు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుంటున్నారు. ఆసుపత్రుల్లో శ్వాససంబంధిత వ్యాధులు, పేషంట్లు పెరిగిపోతున్నారని లెక్కలే చెబుతున్నాయి.

ఇటువంటి పరిస్ధితుల్లోనే ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలను వాయుకాలుష్యం నుండి గట్టెంకించేందుకే కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా కొత్త చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏకంగా కోటి రూపాయల జరిమానా విధించాల్సుంటుంది. అలాగే 5 ఏళ్ళు జైలుశిక్ష కూడా అనుభవించక తప్పదు. ఢిల్లీ ప్రభుత్వం ఆర్డినెన్సు ద్వారా జారీచేసిన చట్టానికి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సంతకం కూడా అయిపోవటంతో గురువారం నుండే కొత్త చట్టం అమల్లోకి వచ్చేసింది.

ఢిల్లీలో ఈస్ధాయిలో వాతావరణ కాలుష్యం పెరిగిపోవటానికి ప్రధాన కారణం రాజస్ధాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకోవటమే. ఈ రాష్ట్రాల నుండి రోజుకు కొన్ని లక్షల మంది వివిధ కారణాలతో ఢిల్లీకి వచ్చేస్తుంటారు. అలాగే ఢిల్లీ శివరు ప్రాంతాల్లోని గుర్ గావ్ లాంటి ప్రాంతాల్లోని పరిశ్రమల నుండి కాలుష్యకారమైన పొగలు 24 గంటలు వస్తునే ఉంటాయి. ఇక దీనికి అదనంగా కోట్లది వాహనాల నుండి బయటకు వస్తున్న పొగ కూడా కారణమే అవుతోంది. ఓ అంచనా ప్రకారం ఢిల్లీలో సుమారు 2.5 కోట్ల వాహనాలున్నాయట.

ఓ దశలో వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్ రోడ్లపై తిరిగే వాహనాలకు సరి సంఖ్య, బేసిసంఖ్య అనే విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం వల్ల కొంతవరకు ఉపయోగాలున్నట్లు అధ్యయనాలు చెప్పాయి. అయితే ఆ ప్రయోగంపై కొందరు కోర్టుకెళ్ళటంతో అది కాస్త అటకెక్కింది. తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త చట్టం వల్ల ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం ఏ స్ధాయిలో ఉందో ప్రతిరోజు శాస్త్రీయంగా లెక్కేస్తారు.

వాతావరణ కాలుష్యానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు, ప్లాంట్లను రెగ్యులర్ గా వాతావరణ కాలుష్య నియంత్రణ కమిటి తనిఖీ చేస్తుంది. కాలుష్యానికి కారణాలవుతున్నాయని గమనించిన కంపెనీలు, ప్లాంట్లకు ముందు వార్నింగ్ ఇస్తారు. అప్పుడు కూడా సర్దుబాటు కాకపోతే వెంటనే మూయించేస్తారు. కమీషన్ ఆదేశాలను జివిల్ కోర్టుల్లో సవాలు చేసేందుకు లేదు. కేవలం జాతీయ హరిత ట్రైబ్యునల్ లో మాత్రమే సవాలు చేయాలని చట్టంలో ఉంది.

అలాగే కాలుష్యానికి కారణాలని నిర్ధారణ అయిన కంపెనీల, ప్లాంట్లు, పరిశ్రమలకు కోటి రూపాయల ఫైన్ తో పాటు గరిష్టంగా ఐదేళ్ళ జైలుశిక్ష వేస్తారు. ఇక్కడ విచిత్రమేమంటే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నపుడు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం చాలా వరకు తగ్గిపోయినట్లు నిపుణులు గుర్తించారు. అయితే ప్రతిరోజు లాక్ డౌన్ సాధ్యంకాదు కదా. అందుకనే వాహనాలు రోడ్లపైకి రాగానే, పరిశ్రమలు, కంపెనీలు, ప్లాంట్లు మొదలుకాగానే మళ్ళీ కాలుష్యం కూడా పెరిగిపోయింది. అందుకనే కొత్త చట్టాన్ని తేవాల్సొచ్చింది కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మరి తాజాగా తెచ్చిన కొత్త చట్టం వల్లయినా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తగ్గుతుందేమో చూడాలి.