ఏపీలో విపక్షం వైసీపీకి చెందిన కీలక నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా.. చోటుచేసుకున్న పరిణామాలే ఈ కేసులకు కారణమని కూడా చెప్పక తప్పదు. అయితే అధికార కూటమి అక్రమంగా కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ అదిష్ఠానం…కేసులకు భయపడవద్దని, పార్టీ లీగల్ టీం అండగా ఉంటుందని పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తోంది. అయితే ఈ భరోసాలో ఒక్కో నేతకు ఒక్కో మాదిరి అన్నట్టుగా న్యాయ సహాయం అందుతోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన బంధువులు, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి ఫ్యామిలీ వంటి వారి కోసం ఓ లీగల్ టీం పనిచేస్తుంటే… మిగిలిన వారి కోసం మరో లీగల్ టీంను రగంలోకి దింపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు చూస్తే ఈ మాట నిజమేనని చెప్పాలి.
జగన్ బాబాయి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డి కాకినాడ పోర్టు కేసులో నిందితుడిగా ఉండగా… ఆయన ముందస్తు బెయిల్ కోసం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఫలితంగా విక్రాంత్ కు ముందస్తు బెయిల్ లభించింది.
తాజాగా మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇప్పించేందుకు కూడా నిరంజన్ రెడ్డే స్వయంగా రంగంలోకి దిగారు. ఫలితంగా బుధవారం మిథున్ రెడ్డికి కూడా ముందస్తు బెయిల్ వచ్చేసింది. ఇక జగన్ పై నమోదు అయిన అక్రమాస్తుల కేసులతో పాటు జగన్ కు సంబంధంచిన దాదాపుగా అన్ని కేసుల విషయంలోనూ నిరంజన్ రెడ్డే కోర్టులకు హాజరవుతున్నారు.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. ఇటీవలే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనని వంశీ మోహన్ ను ఉన్నపళంగా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి ఆయనను విజయవాడ తరలించారు. వంశీ తరఫున బెయిల్ పిటిషన్లు గానీ, ఆ తర్వాత ఆయన కేసుల వాదన విషయంలో గానీ నిరంజన్ రెడ్డి కనిపించనే లేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా పదుల సంఖ్యలో వైసీపీ లాయర్ల బృందం వంశీ తరఫున కోర్టులకు వస్తున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు. చాలా సందర్భాల్లో వంశీ కేసులకు పొన్నవోలు కూడా హాజరు కావడం లేదు.
ఇక ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు సందర్బంగానూ నిరంజన్ రెడ్డి జాడ కనిపించలేదు. పొన్నవోలు మాత్రమే కనిపించారు. అదేంటో గానీ… పొన్నవోలు వాదిస్తున్న కేసులన్నీ కూడా వైసీపీకి ప్రతికూల ఫలితాలనే ఇస్తున్నాయి. పొన్నవోలు వాదనలతో పోసానికి చాలా గ్యాప్ తర్వాత గానీ ఊరట లభించని పరిస్థితి.
వాస్తవానికి నిరంజన్ రెడ్డికి కేసుల వాదనలో మంచి పట్టు ఉంది. పుష్ప సినిమా తొక్కిసలాట కేసులో తెలంగాణ ప్రభుత్వ వాదన బలంగా ఉన్నా.. అల్లు అర్జున్ తరఫున క్షణాల్లో రంగంలోకి దిగి తనదైన శైలి వాదనలు వినిపించిన నిరంజన్ రెడ్డి ఆయనకు బెయిల్ ఇప్పించారు. సుప్రీంకోర్టు పరిధిలోనూ నిరంజన్ రెడ్డికి మంచి పేరు ఉంది. అంత మంచి లాయర్ కు ఏకంగా రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చిన జగన్… ఆయన సేవలను మాత్రం కేవలం తనకూ, తన వారికి మాత్రమే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే పార్టీలో పెద్ద చర్చే నడుస్తున్నట్లు సమాచారం. తన వారి కోసం సత్తా కలిగిన నిరంజన్ రెడ్డిని బరిలోకి దింపుతున్న జగన్…తన వాళ్లు కాదనుకున్న వారి కోసం మాత్రం ఎవరు అందుబాటులో ఉంటే వారినే పంపుతున్నారన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి.