వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి… ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించడంతో పాటుగా జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలగిన పేరుపడ్డ వేణుంబాక విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు షేర్ల బదిలీపై నమోదు అయిన కేసులో సాయిరెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సీఐడీ విచారణకు హాజరైన సాయిరెడ్డి విచారణ అనంతరం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మనస్తత్వం గురించి, తాను జగన్ గురించి ఎందుకు దూరమయ్యాను?.. అసలు రాజకీయాల నుంచి తాను ఎందుకు తప్పుకున్నాను?… వైసీపీని ఎందుకు వీడాను?.. అన్న విషయాలపై సాయిరెడ్డి సవివరంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ కుటుంబంతో తనకు మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని సాయిరెడ్డి చెప్పారు. ఈ క్రమంలో జగన్ తనకు మంచి గుర్తింపు ఇచ్చారని.. కీలక పదవులూ కట్టబెట్టారని ఆయన తెలిపారు. అయితే గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు జగన్ లేరని అన్నారు. జగన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారని కూడా ఆయన ఆరోపించారు. జగన్ చుట్టూ ఓ కోటరీ ఏర్పడిందని సాయిరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. కోటరీ పెద్దలను సంతృప్తిపరిచిన వారికే జగన్ ను కలిసే అవకాశం దక్కుతుందన్నారు. కోటరీకి అనుకూలంగా లేని వారికి జగన్ ను కలిసే అవకాశం దక్కేది కాదన్నారు. ఈ క్రమంలో పార్టీలో పరిస్థితులు, జగన్ లో వచ్చిన మార్పు చూసి తాను కలత చెందానన్నారు. ఆలోచించగా… తన మనసే విరిగిపోయిందన్నారు. అప్పటిదాకా జగన్ పై భక్తితో పాటు ప్రేమ ఉండేవని.. ఇప్పుడు మాత్రం ఆ రెండూ తన ఇష్ట దైవం శ్రీవేంకటేశ్వర స్వామి మీదనే ఉన్నాయని ఆయన తెలిపారు.
వైసీపీని, రాజకీయాలను వీడే సమయంలో లండన్ లో ఉన్న జగన్ కు తాను ఫోన్ చేశానని సాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో తాను గమనించిన అన్ని విషయాలను ఆయన ముందు పెట్టానని తెలిపారు. అయితే ఆ విషయాలను అంగీకరించేందుకు జగన్ సిద్ధంగా లేరన్నారు. పార్టీని వీడొద్దని మాత్రం తనతో జగన్ అన్నారన్నారు. అంతేకాకుండా ప్రలోభాలకు తాను లొంగిపోయానని జగన్ తనపై ఓ అభాండాన్ని వేశారన్నారు. అయితే తాను ప్రలోభాలకు లొంగేవాడిని కాదని జగన్ కే చెప్పానన్నారు. మనసు విరిగిన నేపథ్యంలో జగన్ పార్టీలో కొనసాగమన్నా కూడా తాను కుదరదని తేల్చి చెప్పానన్నారు. ఆ క్రమంలోనే పార్టీని, రాజకీయాలను కూడా వీడానని సాయిరెడ్డి తెలిపారు. తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్పారు. వైసీపీనే కాకుండా మరే ఇతర పార్టీలోనే చేరబోనని కూడా ఆయన తెలిపారు.
ఇక జగన్ భవిష్యత్తు గురించి కూడా సాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎప్పుడైతే తన చుట్టూ చేరిన కోటరీని దూరం పెడతారో అప్పుడు జగన్ తిరిగి మంచి భవిష్యత్తును అందుకుంటారని ఆయన అన్నారు. అలా కాకుండా కోటరీతోనే ఆయన ముందుకు సాగితే… జగన్ కు ఇక భవిష్యత్తే లేదని కూడా ఆయన తేల్చి పారేశారు. పార్టీలో తనకు పదవులు దక్కిన మాట వాస్తవమే గానీ… వాటిని నెరవేర్చే క్రమంలో తాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానో తనకు మాత్రమే తెలుసునన్నారు. జగన్ ఓ నాయకుడని… నాయకుడన్నవాడు ఎప్పుడూ చెప్పుడు మాటలు వినకూడదన్నారు. అలా వింటే పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా దూరమైపోతారన్నారు. ఇదే అంశాన్ని తాను జగన్ కు కూడా చెప్పానని సాయిరెడ్డి తెలిపారు. జగన్ చుట్టూ చేరిన కోటరీలోని కొందరు నేతలు తనను తొక్కేసి… తన పదవులను చేజిక్కించుకున్నారని కూడా ఆయన మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక బీజేపీలో చేరి ఏ గవర్నర్ పదవినో చేపట్టే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయన్న మీడియా ప్రశ్నలకు సాయిరెడ్డి తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. తాను ఒక్కసారి చెబితే ఇక దానికి తిరుగు ఉండదని చెప్పారు. ఇప్పటికే తాను రాజకీయాలకు దూరంగా జరుగుతున్నానని చెప్పానని గుర్తు చేశారు. ఆ మాటే ఫైనల్ అన్న ఆయన రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించే ప్రశ్నే లేదన్నారు. ఇంతకుముందు తాను చెప్పినట్లుగానే ఇప్పుడు తాను వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు. ప్యాంటు, ఇన్ షర్ట్ చేసుకుని ఈయనేం వ్యవసాయం చేస్తారని అంతా హేళనగా మాట్లాడుతున్నారన్న సాయిరెడ్డి… పంచె, గోచీ కట్టుకుంటేనే రైతులా సాగు చేస్తున్నట్టా? అని ప్రశ్నించారు. రైతులపై అలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్యాంటు, షర్ట్ వేసుకున్నా… తాను నిజంగానే వ్యవసాయం చేస్తున్నానని సాయిరెడ్డి చెప్పారు.
This post was last modified on March 12, 2025 3:50 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…