తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు అందరూ స్పందించారు. ఎవరి నచ్చిన అభిప్రాయం వారు వెల్లడించారు. దీనిలో తప్పులేదు. బడ్జెట్ అనేది.. అన్ని వర్గాలను సంతృప్తి పరచాలని ఏమీ లేదు. ఉన్నంతలో దేశానికి, ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ కూర్పు ఉంటుంది. దీంతో ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ వర్గాలు స్పందించాయి. ఎవరి అభిప్రాయం వారు వెల్లడించారు.
కానీ, కీలక ప్రతిపక్షంగా ఉన్న(ప్రధాన కాదు) వైసీపీ మాత్రం రెండు రోజులు గడిచినా ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్పై స్పందించక పోవడం గమనార్హం. నిజానికి గత ఏడాది ప్రవేశ పెట్టిన తాత్కాలిక, పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్లపై వైసీపీ వెంటనే రియాక్ట్ అయింది. మోడీని ప్రశంసించింది. ముఖ్యంగా బడ్జెట్పై మాజీ సీఎం జగనే స్పందించారు. చాలా బాగుందని కితాబు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అయితే.. ఇప్పుడు మాత్రం ఆయన స్పందించలేదు. ఆయన పార్టీ సీనియర్ నాయకులు కూడా స్పందించలేదు. కేవలం రాజకీయ ప్రకటనలు చేసి ఊరుకున్నారు. గతంలో బడ్జటె్ పై పెద్ద ఎత్తున చర్చ చేశారు.
దీనికి కారణమేంటి? ఇప్పుడు ఎందుకు వైసీపీ మౌనంగా ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 1) కేంద్రంతో జగన్కు దూరం పెరగడం. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్లిన తర్వాత.. జగన్.. ఇప్పటి వరకు కేంద్ర పెద్దలతో భేటీ కాలేదు. ఒకే ఒక్కసారి సాయిరెడ్డి కేంద్ర మంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత.. మళ్లీ వైసీపీ తరఫున కేంద్రంతో స్పందించేవారు కరువయ్యారు. దీంతో కేంద్రంతో పనిలేదని జగన్ భావించి ఉంటారన్న చర్చ జరుగుతోంది.
2) బడ్జెట్ ఎలా ఉన్నా.. తాను స్పందిస్తే.. లేనిపోని రాజకీయ విమర్శలు మూటగట్టు కోవడం మినహా వచ్చేది లేదని ఆయన లెక్కలు వేసుకుని ఉంటారన్న అంచనా కూడా ఉంది. అందుకే మౌనంగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు.. మౌనంగా ఉండడంతోపాటు.. చూసీ చూడనట్టే వ్యవహరించడం దీనిలో వ్యూహంగా ఉందని చెబుతున్నారు. పైగా.. తనపై ఉన్న కేసుల్లో కదలిక వస్తే.. అప్పుడు కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందన్న చర్చ కూడా ఉంది. అందుకే.. అన్ని కోణాల్లోనూ ఆలోచించే జగన్ మౌనంగా ఉన్నారని.. లేకపోతే స్పందించేవారని అంటున్నారు.