ప్రభుత్వాలను వణికించిన మాస్ గజదొంగ

వరసగా కమర్షియల్ సినిమాలతో పలకరిస్తున్న మాస్ మహారాజ రవితేజ ఈసారి పీరియాడిక్ డ్రామాతో అందులోనూ ఎవరూ ఊహించని కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అదే టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ 20న దసరా పండగ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మీద అభిమానులకు భారీ అంచనాలున్నాయి. మేకింగ్ నుంచి పోస్టర్ల దాకా హై ఇంటెన్సిటీని చూపించడంతో భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను అలరిస్తుందనే నేపథ్యంలో నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే టీజర్ లో కంటెంట్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందులో కాన్సెప్ట్ ఏంటో గుట్టు విప్పారు.

అయిదారు దశాబ్దాల క్రితం మదరాసు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న నాగేశ్వరరావు(రవితేజ) దేనికైనా తెగించే స్టువర్ట్ పురం గజ దొంగ. చిన్నతనంలోనే తలలు నరికి నెత్తురు కళ్లజూసిన ఈ మనిషికి దోచుకోవాలనే ఆలోచన వస్తే చాలు ముందు వెనుకా చూడడు. ఇవే తెలివితేటలను వాడితే ఒక గొప్ప రాజకీయవేత్త, బిజినెస్ మెన్ కాగలడని భావించే స్తాయిలో లూటీలు చేస్తాడు. నాగేశ్వరరావుని పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్(మురళి శర్మ)కు ఇదో పెద్ద సవాల్ గా కనిపిస్తుంది. అసలతను అంత పెద్ద దొంగగా ఎందుకు మారాడు, ఎవరి కోసం ఇదంతా చేశాడనేది తెరమీదే చూడాలి

విజువల్స్ అప్పటి వాతావరణాన్ని పునఃసృష్టించిన తీరు చాలా బాగుంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ కష్టం కనిపిస్తోంది. దర్శకుడు వంశీ చాలా డెప్త్ తో కెజిఎఫ్ రేంజ్ లో రవితేజ హీరోయిజంని ప్రెజెంట్ చేసిన వైనం ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం విజువల్స్ ని ఎలివేట్ చేసింది. ఆర్టిస్టులను ఎక్కువ రివీల్ చేయలేదు. రవితేజ పూర్తి గెటప్ కాకుండా ఫాస్ట్ గా కట్ చేసి ఉత్సుకత ను పెంచారు. మాది ఛాయాగ్రహణం నాణ్యతలో పోటీ పడింది. భగవంత్ కేసరి, లియో, ఘోస్ట్ లతో పోటీపడబోతున్న టైగర్ నాగేశ్వరరావు చిన్న టీజర్ తోనే హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లింది.