స్పిరిట్ కోసం క్రేజీ విలన్ జంట ?

దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇది ఖచ్చితంగా తనకు పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంగా ఉన్నాడు. ఆదిపురుష్ తో మనకు గతంలో పరిచయమైనప్పటికీ దాన్ని అసలు డెబ్యూగానే పరిగణించడం లేదు సైఫ్. ఇదిలా ఉండగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే స్పిరిట్ లో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ ని సంప్రదించినట్టు లేటెస్ట్ గాసిప్. యానిమల్ చివరి ముప్పావు గంటలో బాబీ డియోల్ ని చూపించిన తీరు ఏ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుందో చూశాం.

అదే తరహాలో అంతకు మించి అనేలా స్పిరిట్ విలన్ ని డిజైన్ చేశారని ఇన్ సైడ్ టాక్. అంతే కాదు ప్రభాస్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రని కవ్వించేలా వయొలెంట్ భార్యా భర్తల క్యారెక్టర్లు ఉంటాయని, సాధ్యమైతే కరీనా కపూర్ నే సైఫ్ కు జోడిగా తీసుకోవాలని ట్రై చేస్తున్నారట. మహేష్ బాబు అర్జున్ లో ప్రకాష్ రాజ్, సరితా టైపన్న మాట. ప్రస్తుతానికి పుకారు దశలోనే ఉంది కాబట్టి నిర్ధారణగా నిజమా కాదాని చెప్పలేం కానీ ఇటీవలే ఒక సౌత్ ప్యాన్ ఇండియా మూవీకి కరీనా సైన్ చేసిన మాట అయితే వాస్తవం. అది స్పిరిటా లేక మహేష్ బాబు రాజమౌళి సినిమానా అనేది తేలాల్సి ఉంది.

ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజి పనుల మీదున్నాడు. మొదటిది ఏప్రిల్ విడుదలకు రెడీ అవుతుండగా రెండోది వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కల్కి 2, సలార్ 2 ఇంకా టైం పట్టేలా ఉన్నాయి. వీటికన్నా ముందు స్పిరిట్ సెట్స్ పైకి వెళ్తుంది. ప్రొడక్షన్ కోసం సందీప్ వంగా ఏడాదిన్నర టైం అడిగినట్టు తెలిసింది. బడ్జెట్ అయిదు వందల కోట్ల దాకా వెళ్లొచ్చని అంటున్నారు. పోలీస్ స్టోరీనే అయినప్పటికీ యాక్షన్ ఎపిసోడ్స్ భారీ ఎత్తున ఉండబోతున్నాయట. తన మేకింగ్ స్టైల్ తో పాటు కమర్షియల్ అంశాలను సందీప్ కొత్తగా హ్యాండిల్ చేయబోతున్నారని యూనిట్ న్యూస్.