చరణ్ అభిమానుల నెగిటివ్ ట్రెండింగ్

ఎంతసేపూ డిసెంబర్ విడుదలని చెప్పడం తప్ప ఇంకే అప్డేట్ లేదని ఊగిపోతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం నిర్మాణ సంస్థ మీద ఒత్తిడి పెంచేలా మెగా ఫాన్స్ నెగిటివ్ ట్రెండింగ్ మొదలుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఎస్విసి, దిల్ రాజుతో పాటు రామ్ చరణ్, తమన్ తదితరులను ట్యాగ్ చేస్తూ దర్శకుడు శంకర్ ని లక్ష్యంగా చేసుకుని వేల సంఖ్యలో ట్వీట్ వేయడం మొదలుపెట్టడంతో నిమిషాల వ్యవధిలో ఇవి వైరలైపోతున్నాయి. వాళ్ళు పెట్టుకున్న ట్యాగ్ లైన్ కొంచెమే అభ్యంతరకరంగా ఉండటంతో అదేంటో ఇక్కడ చెప్పలేం కానీ కోపం ఏ స్థాయిలో ఉందో చెప్పడం దాని తీవ్రతని తేటతెల్లం చేస్తోంది.

చరణ్ అభిమానుల ప్రధానమైన డిమాండ్ గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడొస్తుందనే. ఇంకా నాలుగు నెలల సమయమే ఉండటంతో ఇంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమాకి ఇప్పటినుంచైనా ప్రమోషన్లు చేయాలని కోరుతున్నారు. వినాయచవితికి డిసెంబర్ 20 విడుదల తేదీతో కూడిన ఒక కొత్త పోస్టర్ వదులుతారని ఆల్రెడీ లీక్ ఉంది. కానీ ఫ్యాన్స్ అది చాలదు అంటున్నారు. ఏదైనా వీడియో కంటెంట్ లేదా రెండో లిరికల్ సాంగ్ కావాలనేది వాళ్ళు తక్షణం అడుగుతున్నది. శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన లేకుండానే ఇటీవలే ఎస్జె సూర్య, శ్రీకాంత్ మీద బ్యాలన్స్ ప్యాచ్ వర్క్ తీశారట.

ఇంత టైట్ వర్క్ ప్రెజర్ లో టీజర్ ఇప్పటికిప్పుడు సిద్ధం కాదు కాబట్టి త్వరగా వస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. తమన్ నేరుగా పేరుని ప్రస్తావించకపోయినా టీమ్ పడుతున్న కష్టాన్ని గుర్తించమని, మనసులు గాయపడేలా సోషల్ మీడియాలో ఎలాంటి పనులు చేయొద్దని ఎక్స్ వేదికగా కోరడం చూస్తుంటే వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న గేమ్ ఛేంజర్ ఎస్విసికి 50వ సినిమా. దాని తర్వాత మొదలైనవి షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయిపోయి ఓటిటిలో వచ్చేయగా ఇది మాత్రం అదిగో ఇదిగో అంటూ ఆలస్యమవుతూనే వస్తోంది.