విపత్తు సమయంలో టాలీవుడ్ పెద్ద మనసు

తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో కుదేలైపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రులే రంగంలోకి దిగినా అంత సులభంగా కొలిక్కి తేలేనంత దారుణంగా వరుణుడు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చేయూతనివ్వడానికి టాలీవుడ్ స్టార్లు ముందుకు వస్తున్నారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఏపీ తెలంగాణకు కలిపి కోటి రూపాయల విరాళం ప్రకటించాక ఒక్కొకరుగా తమ ఆపన్న హస్తం అందిస్తున్నారు. బాలకృష్ణ కోటి అందించగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చెరి కోటి రూపాయలు ప్రకటించారు.

సిద్దు జొన్నలగడ్డ 30 లక్షలు, హారికా హాసిని 50 లక్షలు, వైజయంతి మూవీస్ 50 లక్షలు, విశ్వక్ సేన్ 10 లక్షలు, వెంకీ అట్లూరి 10 లక్షలు అందించారు. అనన్య నాగళ్ళ లాంటి చిన్న హీరోయిన్ సైతం అయిదు లక్షలు ఇవ్వడం విశేషం. ఈ లిస్టు ఇంకా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి విపత్కర తరుణంలో వీలైనంత ఆర్థిక అండదండలు అందించడం ఎంతైనా అవసరం. సామాన్యులు సైతం తోచినంత సాయం అందిస్తూనే ఉన్నారు. వరద ప్రభావం ఇంకో మూడు నాలుగు రోజులు ఉండేలా కనిపిస్తోంది కనక నష్టం ఏ స్థాయిలో ఉండనుందో అప్పుడే ఒక కొలిక్కి రాలేం.

ఒకేసారి ఏపీ తెలంగాణలను భారీ వర్షాలు ముంచెత్తడంతో విరాళాలు సరిసమానంగా అందిస్తున్నారు స్టార్లు. చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఓ వంద రూపాయలు చందా ఇవ్వడానికే వందసార్లు ఆలోచించే రోజుల్లో సిద్ధూ, విశ్వక్ లాంటి మీడియం రేంజ్ హీరోలు సైతం ధారాళంగా డొనేషన్లు ఇవ్వడం ఎందరికో స్ఫూర్తినిచ్చేదే. గతంలోనూ పలుసార్లు ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు టాలీవుడ్ సాయం చేయడంలో ముందుంది. ఇప్పుడు మరోసారి తన పెద్ద మనసును చాటుకుని అభిమానులను కదిలిస్తోంది.