‘దసరా’కు జరిగినట్లే.. ‘సరిపోదా’కు

నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా.. దసరా. ఆ చిత్రానికి ఏకంగా రూ.100 కోట్ల మేర గ్రాస్ వచ్చింది. ఐతే ఓవరాల్‌గా ఆ సినిమా హిట్టే కానీ.. ఏపీలో మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. తెలంగాణ యాస, కల్చర్ బాగా దట్టించడం వల్లో ఏమో.. ఈ సినిమా నైజాంలో మాదిరి ఏపీలో ఆడలేదు. కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పలేదు. ఓవరాల్‌గా అక్కడ ఆ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది. కానీ నైజాంలో మాత్రం ‘దసరా’ బ్లాక్ బస్టర్ ఫలితాన్నందుకుంది.

నాని తర్వాతి చిత్రం ‘హాయ్ నాన్న’ మాత్రం అన్ని చోట్లా ఒకే రకంగా ఆడింది. కానీ ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ పరిస్థితి చూస్తే.. దసరా పరిస్థితి రిపీటయ్యేలా ఉంది. అలా అని ఇందులో కల్చర్, యాస్ లాంటి అంశాలు ప్రభావితం చేసేలా లేవు.

‘సరిపోదా శనివారం’ మంచి టైమింగ్‌లోనే రిలీజయ్యింది. టాక్, రివ్యూలు కూడా డీసెంట్‌గానే వచ్చాయి. ప్రేక్షకులు ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న టైంలో నాని సరిపడా వినోదాన్నే అందించాడు. కానీ వర్షాలు ఈ చిత్రాన్ని పెద్ద దెబ్బ కొట్టాయి. నైజాంకు కేంద్ర స్థానం అయిన హైదరాబాద్‌లో వర్షం పడ్డా మరీ ఇబ్బందికరంగా ఏమీ లేదు పరిస్థితి. దీంతో నైజాం కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఇప్పటికే రూ.8 కోట్లకు పైగా షేర్‌తో బ్రేక్ ఈవెన్‌ మార్కుకు చేరువ అయిపోయింది ‘సరిపోదా శనివారం’. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదు.

వర్షం వల్ల విజయవాడ, గుంటూరు సహా పలు ప్రాంతాలు సమస్యల్లో చిక్కుకోవడం ‘సరిపోదా శనివారం’ వసూళ్ల మీద తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ బ్రేక్ ఈవెన్ మార్కులో సగం కంటే కాస్త ఎక్కువగా వసూళ్లు వచ్చాయంతే. ఇంకో 40-45 శాతం రికవరీ అవ్వాల్సి ఉంది. ఫుల్ రన్లో అది జరుగుతుందా అన్నది సందేహంగానే ఉంది. దీంతో ‘దసరా’ ఫలితమే మరోసారి రిపీటయ్యేలా ఉంది.