60 రోజులు ఏడిపించిన తప్పు

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని పెద్దలు ఊరికే రాయలేదు. సగటు మనిషి జీవితంలోనే కాదు స్టార్ల లైఫుల్లోలోనూ ఇలాంటివి జరుగుతాయి. చియాన్ విక్రమ్ అలాంటి అరుదైన అనుభవాన్ని ఇటీవలే పంచుకున్నాడు. 1994లో దర్శకుడు మణిరత్నం బొంబాయి తీయాలని సంకల్పించుకున్నప్పుడు ఆడిషన్లు నిర్వహించారు. రోజా లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చేస్తున్న మూవీ కావడంతో పాటు బాబ్రీ మసీదు కూల్చివేత బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారని తెలిసి ప్రకటన సమయంలోనే విపరీతమైన వివాదాలు, చర్చలు రేగాయి. ఇలాంటి చిత్రంలో అవకాశం వస్తే ఎవరు మాత్రం వద్దంటారు.

అప్పటికే విక్రమ్ మీడియం రేంజ్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు కానీ హీరోగా పెద్ద బ్రేక్ లేదు. దీంతో టీమ్ నుంచి వచ్చిన పిలుపు మేరకు బొంబాయి ఆడిషన్లకు వెళ్ళాడు. మణిరత్నం స్టిల్ కెమెరా తీసుకొచ్చి ఒక సన్నివేశం వివరించి దాన్ని నటించి చూపించమన్నారు. అదేంటి స్టిల్ ఫోటోగ్రఫీతో ఎక్స్ ప్రెషన్లు ఎలా రాబట్టుకుంటారనే అనుమానంతో విక్రమ్ అలా నిలుచుండిపోయాడు. ఒకవేళ కదిలితే బ్లర్ అవుతుందనే భయంతో బిగదీసుకుపోయాడు. దీంతో ఆఫర్ చేజారింది. కట్ చేస్తే అది కాస్తా అరవింద్ స్వామిని వరించడం, బొంబాయి దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన చిత్రంగా నిలిచిపోవడం జరిగిపోయాయి.

దెబ్బకు విక్రమ్ రెండు నెలల పాటు ఏడుస్తూనే ఉండాల్సి వచ్చింది. రోజు ఉదయం లేవడం, మణిరత్నం కెమెరా ముందు మౌనంగా నిలుచోవడం గుర్తొచ్చి కన్నీళ్లు ధారాళంగా కురిసేవి. ఒకవేళ బొంబాయి కనక చేసుంటే కెరీర్ లోనే అతి పెద్ద బ్రేక్ అప్పుడే వచ్చేది. ఒక క్లాసిక్ కి హీరోగా ఉన్నాననే సంతృప్తి మిగిలేది. ఇదంతా ఒక తప్పు వల్ల చేజారి వేరేవాళ్లు ఎగరేసుకుపోయారు. అప్పుడు మిస్ అయిన అదృష్టం తిరిగి అదే మణిరత్నంలో విలన్, పొన్నియిన్ సెల్వన్ 1-2 రూపం వచ్చింది. ఇటీవలే వంద కోట్ల గ్రాస్ సాధించిన తంగలాన్ సక్సెస్ ప్రమోషన్లలో భాగంగా ఇదంతా విక్రమ్ స్వయంగా పంచుకున్నాడు.