ఇంద్రకు స్ఫూర్తి సమరసింహారెడ్డి – చిరంజీవి

ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇంద్ర రిలీజైనప్పుడు ఫ్యాక్షన్ సినిమాలకు శ్రీకారం చుట్టిన సమరసింహారెడ్డిని చూసే అశ్వినిదత్ ఇలాంటి కథను తయారు చేయించారనే డిబేట్ అప్పట్లో బాలయ్య ఫ్యాన్స్ మధ్య జోరుగా జరిగేది. సోషల్ మీడియా, ఇంటర్ నెట్ లేని ప్రపంచం కావడంతో వాటికి ఆధారాలు లేవు కానీ ఆ టైంలో థియేటర్ల దగ్గర కలుసుకునే ఇద్దరు హీరోల అభిమానులు ఎవరిని కదిపినా ఈ సంఘటన చెబుతారు. ఇన్నేళ్ల తర్వాత స్వయంగా చిరంజీవే దానికి స్పష్టత ఇవ్వడంతో ఇక చర్చకు ఆస్కారం లేకుండా పోయింది. బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల్లో ఈ అరుదైన ముచ్చట జరిగింది.

తన ప్రసంగంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఇంద్ర తన దగ్గరికి వచ్చినప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ అంటేనే బాలకృష్ణ గుర్తుకు వస్తున్న టైంలో ఇది చేయడమా వద్దా అనే మీమాంస కలిగిన మాట వాస్తవమేనని, కానీ మంచి కంటెంట్ కుదరడం వల్ల ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందించారని అన్నారు. అంతే కాదు ఇప్పటి రచయితలు దర్శకులు ఎవరైనా సరే ఇంద్రసేనారెడ్డి వెర్సెస్ సమరసింహారెడ్డి కథ కనక రాసుకుని వస్తే నటించడానికి నేను రెడీ అని చెప్పడంతో పాటు బాలయ్యనూ అడిగారు. దానికి ఆయన రెడీ రెడీ అంటూ రెండుసార్లు నొక్కిచెప్పడం ఆహుతులను ఆకట్టుకుంది.

అంతేకాదు బోయపాటి, వైవిఎస్ చౌదరిలను ఉద్దేశించి నా ఛాలెంజ్ ని స్వీకరిస్తారా అంటూ వేదికపై నుంచే పిలుపు ఇవ్వడం ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. చిరు, బాలయ్య మల్టీస్టారర్ ఎప్పటి నుంచో మూవీ లవర్స్ కంటున్న కల. ఆర్ఆర్ఆర్ తరహాలో ఇది కూడా నిజమైతే రికార్డుల ఊచకోతకు కొత్త అర్థాలు వెతకాల్సి వస్తుంది. మెగాస్టార్ యథాలాపంగ అన్నా లేక నిజంగా ఆ కోరికతో అన్నా ఎవరో ఒకరు దీనికి పూనుకోవడం చాలా అవసరం. ఆరు పదులు దాటిన వయసులో తెరమీద చిరు, బాలయ్య నువ్వా నేనా అంటూ సవాల్ విసురుకుంటే థియేటర్లలో మాస్ జనం పోతారు, మొత్తం పోతారు అనాల్సి వస్తుంది.