పవన్ ఫ్యాన్స్ తరఫున బండ్ల గణేష్ హామీ

కొత్త సినిమాలకు అభిమానులు వీర లెవల్లో సందడి చేయడం మాములే కానీ ఈ మధ్య రీ రిలీజులకు అంతకు మించిన హంగామా పరిపాటిగా మారింది. దీని వల్ల పలు చోట్ల థియేటర్ యజమానులు నష్టపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్ అత్యుత్సాహంతో సీట్లు విరగొట్టడం, స్క్రీన్లు చింపేయడం లాంటివి జరిగాయి. మొన్నే నాగార్జున మాస్ ఆడుతున్న ఒక హాలులో హలో బ్రదర్ పాట వేసినప్పుడు ఏకంగా బాణా సంచా కాల్చిన వీడియో వైరలయ్యింది. ఇలాంటి సంఘటనలు చూసి బెంబేలెత్తడం సహజం. ఇక సెప్టెంబర్ 2 రాబోయే గబ్బర్ సింగ్ కి ఏ రేంజ్ ఉంటుందో వేరే చెప్పాలా.

దీని గురించి నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకు చెడ్డపేరు తీసుకురారని, క్రమ శిక్షణతో ఉంటారని, అపోహలతో థియేటర్లు ఇవ్వని విషయం నా దృష్టికి వచ్చిందని, దయచేసి షోలు ఇమ్మని విన్నపం చేయడం ఇవాళ ప్రెస్ మీట్ హైలైట్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. నిజానికి గబ్బర్ సింగ్ టికెట్ల డిమాండ్ మాములుగా లేదు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ మూడు మెయిన్ సింగల్ స్క్రీన్లలో మొత్తం పదిహేను షోలు వేస్తే దేనికీ టికెట్లు దొరకడం లేదు. ఎంత రికమండేషన్ ఉన్నా కనీసం వెయ్యి ఖర్చు పెట్టనిదే బ్లాక్ లో దొరికే పరిస్థితి లేదు.

ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో అన్నింటా ఇదే సీన్ ఉందని ట్రేడ్ టాక్. ఈసారి అల్లరి ఎక్కువగా ఉండొచ్చని, మురారి రికార్డులను పెద్ద మార్జిన్ తో దాటడమే లక్ష్యంగా పెట్టుకున్న ఫ్యాన్స్ దానికోసం ఎక్కువ షోలు అడుగుతున్నారనే ప్రచారం ఆల్రెడీ జరుగుతోంది. ఎన్ని ఇస్తున్నా సరే ఫుల్ కావడం గమనించాల్సిన విషయం. సరిపోదా శనివారం లాంటి కొత్త హిట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఉన్నా ఈ స్థాయిలో స్క్రీన్ల కేటాయింపు జరగడమంటే అది ఒక్క పవన్ మానియా అనే చెప్పాలి. ఏకంగా బండ్ల గణేష్ కే టికెట్ల కోసం ఫోన్లు వస్తే ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఆయనే చెప్పడం కొసమెరుపు