చైతు జోస్యం – వేణుస్వామి యుటర్న్

ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహ బంధం ఎక్కువ కాలం సాగదంటూ, కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోతారని వేణుస్వామి జాతకం చెప్పడం ఎంత వివాదాస్పదమయ్యిందో తెలిసిందే. దీనికి నిరసనగా తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్, తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ సంయుక్తంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాయి. గతంలో తప్పుడు జోస్యాలు చెప్పి పాపులారిటీ కోసం పాకులాడతారని ఈయన మీద ఎలిగేషన్లున్నాయి. జగన్ మళ్ళీ సీఎం అవుతారని, ప్రభాస్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయని చెప్పి నవ్వులపాలయ్యాడు.

తాజాగా చైతు ఇంకా పెళ్లిపీటలు ఎక్కక ముందే విడిపోవడం గురించి వేణుస్వామి చెప్పడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది చాలా దూరం వెళ్తోందని గుర్తించిన సదరు పెద్ద మనిషి ఇకపై సినిమా స్టార్లు, రాజకీయ నాయకులకు జోస్యం చెప్పనని ఒక వీడియో మెసేజ్ విడుదల చేశారు. నిజానికి బిగ్ బాస్ సీజన్ 8లో ఈయన ఎంపికైనట్టు టాక్ ఉంది. దానికి వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న నాగార్జున కొడుకు మీదే ఇలాంటి ఇష్యూ సృష్టించడంతో అక్కినేని అభిమానులు భగ్గుమన్నారు. మంచి ఆఫర్ చేయి దాకా వచ్చి పోతుందనే ఇలా సారీ చెప్పి ఉండొచ్చని నెటిజెన్లు ఎద్దేవా చేస్తున్నారు.

ఏది ఏమైనా సెలెబ్రిటీల విషయంలో అందులోనూ వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెప్పడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఎందరో తారలు వేణుస్వామితో పూజలు చేయించడం గతంలో చూశాం. ముఖ్యంగా హీరోయిన్లు ఈ వరసలో ముందున్నారు. ఇకనైనా వీటిని ఆపేయడం మంచిదని అభిమానులు కోరుతున్నారు. గుడ్డి నమ్మకంతో అవసరం లేని ప్రాధాన్యం ఇవ్వడం వల్లే వేణుస్వామి లాంటి వాళ్ళు ఏం చెప్పడానికైనా సిద్ధపడతారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అన్నట్టు ఇలా యుటర్న్ తీసుకోవాల్సి వస్తుందని సదరు వేణుస్వామి ముందుగానే చూసుకున్నారో లేదో.