థియేటర్ల నిండా సినిమాలు….కనిపించని జనాలు

నిన్న ఈ రోజు కలిపి బోలెడు కొత్త సినిమాలు థియేటర్లలో అడుగు పెట్టాయి. అన్ని చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలే అయినప్పటికీ ఎవరికి వారు ప్రమోషన్లు గట్టిగా చేసుకుని టాక్ మీద ఆధారపడి రిలీజులు చేసుకున్నారు. మాములుగా అయితే ఇన్ని విడుదలవుతున్నప్పుడు జనంతో హాళ్లు కళకళలాడాలి. కానీ ప్రస్తుతానికి అదేమీ కనిపించడం లేదు. నిన్న శివం భజేకు వచ్చిన పబ్లిక్ సోసోనే. అల్లు శిరీష్ బడ్డీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు కానీ ఓ రెండు షోలు అయ్యాక పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి సాయంత్రమో లేక రెండో రోజో పికప్ ని ఆశించవచ్చు.

రాజ్ తరుణ్ తిరగబడరా సామీది ఇదే పరిస్థితి. అతని చుట్టూ ఉన్న వివాదం బజ్ తేవడానికి ఉపయోగపడలేదు. పురుషోత్తముడు రెండో వారంలో అడుగుపెట్టడం ఆలస్యం దీన్ని తేవడం ప్రభావం చూపిస్తోందని ట్రేడ్ టాక్. ఉషా పరిణయం, అలనాటి రామచంద్రుడు, విరాజి, లారీ చాప్టర్ 1, యావరేజ్ స్టూడెంట్ నాని ఇలా మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అయితే కరెంట్ బుకింగ్స్ నే నమ్ముకున్న వీటికి చాలా చోట్ల మార్నింగ్ షోలు సగం ఫుల్ కావడమే గొప్పనేలా ఉంది. ఒకవేళ రివ్యూలు, టాక్ కనక బ్రహ్మాండంగా ఉన్నాయని తీర్పిస్తే కానీ మార్పు రాదు.

వచ్చే వారం మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ లాంటి పెద్ద సినిమాలు ఉన్న నేపథ్యంలో మూవీ లవర్స్ ఆ వారానికి బడ్జెట్ కేటాయించుకుని ఇప్పుడైతే థియేటర్లకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. వీళ్ళను కదిలించాలంటే టాక్ చాలా కీలకం. మొన్నటిదాకేమో అనావృష్టి లాగా ఉంటే ఇప్పుడు అతివృష్టి లాగా బోలెడు రిలీజులు వచ్చి పడ్డాయి. ఏది ఏమైనా నిర్మాతలు పరస్పరం ఒక అవగాహనతో వారంలో ఒక మూడు నాలుగు మాత్రమే విడుదల జరిగేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఓవర్ క్లాష్ తో ఎవరూ లాభపడక రివర్స్ లో అందరూ నష్టపోయే పరిస్థితి తలెత్తుతోంది.