‘రామయ్యా వస్తావయ్యా’ ఎందుకు పోయిందంటే?

‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా.. రామయ్యా వస్తావయ్యా. అలాంటి సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్‌తో హరీష్ జత కడితే అంచనాలు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో చెప్పేదేముంది? కానీ ఈ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ప్రేక్షకులను కనీస స్థాయిలో కూడా మెప్పించలేక బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.

తారక్, హరీష్ ఇద్దరి కెరీర్లలోనూ ఇది పెద్ద డిజాస్టర్లలో ఒకటి. నిర్మాత దిల్ రాజు సైతం తనకు అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇదొకటని చెప్పుకున్నారు. ఐతే ఎలాంటి దర్శకుడైనా సినిమా పోయాక దాని మీద పోస్టు మార్టం చేసుకుంటాడు. హరీష్ శంకర్ సైతం అదే చేసుకున్నాడట. ఆ సినిమా ఎందుకు పోయిందో తనకు తర్వాత అర్థమైందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ చెప్పాడు.

‘రామయ్యా వస్తావయ్యా’కు సెకండాఫే సమస్య అని హరీష్ చెప్పాడు. ఇంటర్వల్లోనే మెయిన్ విలన్ చనిపోతాడని.. అక్కడే సినిమా అయిపోయిందని.. ముందే ప్రధాన విలన్ చనిపోవడంతో ఇంక చూడ్డానికి ఏముందని ప్రేక్షకులు ఫీలయ్యారని హరీష్ అన్నాడు. సెకండాఫ్ కథ, స్క్రీన్ ప్లే సరిగా చేసుకోలేదని ఆయన చెప్పాడు.

ఐతే తన కెరీర్లో అత్యంత కష్టపడ్డ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’నే అని హరీష్ చెప్పడం గమనార్హం. ‘మిరపకాయ్’; ‘గబ్బర్ సింగ్’ తర్వాత తన మీద అంచనాలు పెరిగాయని.. తాను కూడా హ్యాట్రిక్ కొట్టాలన్న ఉద్దేశంతో ఆ సినిమాకు ఎంతో కష్టపడి పని చేశానని.. కానీ కష్టానికి ఫలితం దక్కలేదని.. ఈ సినిమా ఫెయిల్యూర్ విషయంలో తాను ఎవ్వరినీ నిందించని.. అందుకు పూర్తి బాధ్యత తనదే అని హరీష్ స్పష్టం చేశాడు. తాను సక్సెస్‌ను వేరే వాళ్లకు ఆపాదిస్తాను తప్ప, ఫెయిల్యూర్‌ను మాత్రం తనే తీసుకుంటానని అన్నాడు.