కొత్త సినిమా.. సింగిల్ స్క్రీన్లో 99, మల్టీప్లెక్స్‌లో 125

ఓవైపు కరోనా తర్వాత ఓటీటీ వినోదానికి అలవాటు పడిన జనం ఒకప్పట్లా థియేటర్లకు రావట్లేదు అంటారు. ఇంకోవైపేమో.. కొంచెం క్రేజ్ ఉన్న సినిమా వచ్చిందంటే చాలు, టికెట్ల ధరలు పెంచేస్తారు. ఆల్రెడీ దక్షిణాదిన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర టికెట్ల రేట్లు ఎక్కువ. దీనికి తోడు కొత్త సినిమాలకు అదనపు రేట్లు పెడితే ఇక జనం థియేటర్లకు రావడానికి ఎందుకు ఇష్టపడతారు? టికెట్ల రేట్ల గురించి గతంలో ఆందోళన వ్యక్తం చేసిన అగ్ర నిర్మాత సురేష్ బాబు సైతం పెద్దగా బజ్ లేని ‘ఇండియన్-2’ సినిమాకు రేట్లు పెంచుకోవడం విడ్డూరం.

ఇలాంటి సమయంలో కొత్తగా రిలీజ్ కానున్న ఓ సినిమాకు ఉన్న రేట్లను తగ్గిస్తుండడం విశేషం. ఆ చిత్రమే.. బడ్డీ. అల్లు శిరీష్ హీరోగా తమిళ దర్శకుడు సామ్ ఆంటన్ రూపొందించిన చిత్రమిది. ఈ నెల 26కే అనుకున్న ‘బడ్డీ’ని మళ్లీ వాయిదా వేసి ఆగస్టు 2న రిలీజ్ చేయబోతున్నారు.

అల్లు శిరీష్ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. ‘బడ్డీ’ అతడి కెరీర్లో ముఖ్యమైన సినిమా. దీని మీద అతను చాలా ఆశలతో ఉన్నాడు. దీన్ని ప్రేక్షకులకు చేరువ చేయడం కోసం.. ఏపీ, తెలంగాణల్లో ఉన్న టికెట్ల ధరలను తగ్గించి రిలీజ్ చేస్తోంది చిత్ర బృందం. సింగిల్ స్క్రీన్లలో రూ.99, మల్టీప్లెక్సుల్లో రూ.125 పెట్టి ఈ సినిమా చూడొచ్చు. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ ధర రూ.150కి తక్కువ ఎక్కడా లేదు. మల్టీప్లెక్సుల్లో నార్మల్ సీట్ రేటు రూ.150 నుంచి రూ.295 వరకు ఉంది. రూ.125 రేటుతో ప్రీమియం మల్టీప్లెక్సుల్లో సినిమా చూసే అవకాశం కల్పించడం అంటే ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించవచ్చు.

ఓ హాలీవుడ్ మూవీ ఆధారంగా తీసిన తమిళ చిత్రం ‘టెడ్డీ’లో బేసిక్ ప్లాట్ తీసుకుని.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారు. తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అజ్మల్ అమీర్ విలన్ పాత్ర పోషించాడు.