తేజు.. అంతా సెట్టయినట్లేనా?

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఒకప్పుడు ఎంత హుషారుగా ఉండేవాడో తెలిసిందే. కానీ మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్నాక ఆ జోష్ అంతా పోయింది. తన లుక్స్ మారిపోయాయి. రీఎంట్రీ మూవీ ‘విరూపాక్ష’లో తేజు బొద్దుగా కనిపించాడు. తన కదలికల్లో చురుకుదనం కనిపింంచలేదు. డైలాగ్ డెలివరీ సైతం మారిపోయింది. రీఎంట్రీలో పెద్ద హిట్టయితే కొట్టాడు కానీ.. తెర మీద అతణ్ని చూస్తే కొంచెం తేడాగానే కనిపించాడు. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘బ్రో’లోనూ తేజులో హుషారు కనిపించలేదు.

ఐతే ఆ టైంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకోలేదని.. తనకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటన్నింటినీ అధిగమించి పూర్తి ఫిట్‌గా తయారు కావడానికి టైం పడుతుందని.. అందుకోసం గ్యాప్ కూడా తీసుకుంటున్నానని చెప్పాడు.

ఐతే ఆ టైంలో మూణ్నాలుగు నెలలే గ్యాప్ అని చెప్పాడు కానీ.. ‘బ్రో’ రిలీజై ఏడాది కావస్తున్నా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేదు తేజు. సంపత్ నందితో అతను చేయాల్సిన ‘గాంజా శంకర్’ ఆగిపోవడమే గ్యాప్ పెరగడానికి కారణం కావచ్చు. ఐతే అనుకోకుండా వచ్చిన ఈ లాంగ్ గ్యాప్‌ను తేజు బాగానే ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరంగా అతను అన్ని సమస్యలనూ అధిగమించాడని అంటున్నారు.

తన కొత్త చిత్రం కోసం తేజు ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీ పెంచుతున్నాడట. కొన్ని నెలలుగా బయటికి రాని తేజు.. పూర్తి ఫిట్‌గా తయారైన కొత్త లుక్‌తో ఆశ్చర్యపరచనున్నాడట. సిక్స్ ప్యాక్ చేసే స్థాయికి వచ్చాడంటే తేజు పూర్తిగా కోలుకున్నాడని భావించవచ్చు. రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో తేజు ఇటీవలే ఓ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.