దిల్ రాజు చెప్పిన గేమ్ ఛేంజర్ శుభవార్త

మూడేళ్లకు పైగా ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతున్న గేమ్ ఛేంజర్ విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ నిర్మాత దిల్ రాజు స్వయంగా పంచుకున్నారు. ధనుష్ హీరోగా రూపొందిన రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన సందర్భంగా తన ప్రసంగంలో ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ ప్రస్తావన తెచ్చారు. డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండక్కు కలుద్దామంటూ స్పష్టంగా పేర్కొనడంతో ఇప్పటిదాకా చక్కర్లు కొడుతున్న రకరకాల వార్తలకు బ్రేక్ వేసినట్టయ్యింది. మెగాభిమానులు నిన్న మొన్నటి దాక 2025కి వాయిదా పడుతుందేమోనని టెన్షన్ పడిన దాఖలాలు లేకపోలేదు.

దిల్ రాజు ప్రకటనతో ఒక్కసారిగా సమీకరణాలు మారబోతున్నాయి. డిసెంబర్ 20 అధికారికంగా లాక్ చేసుకున్న నితిన్ రాబిన్ హుడ్, చైతు తండేల్ లు మార్పు చేసుకోవాల్సి రావొచ్చు. డిసెంబర్ 6న పుష్ప 2 ది రూల్ వచ్చినా దాని తర్వాత మూడు వారాల గ్యాప్ ఉంటుంది కాబట్టి గేమ్ ఛేంజర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ బాలయ్య 109 కూడా అదే సీజన్ ను టార్గెట్ చేసుకుంటే అప్పుడు లెక్కలు మారతాయి. దర్శకుడు శంకర్ బాలన్స్ ఉన్న ప్యాచ్ వర్క్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉండగా ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ చెన్నైలో జరుగుతోంది. ఇంకా అయిదు నెలల సమయం ఉంది.

విఎఫెక్స్ తాలూకు వర్క్స్ కూడా కొలిక్కి వస్తున్నాయని యూనిట్ టాక్. గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అయితే డిసెంబర్ మంచి నెలా కాదానే అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, కెజిఎఫ్ చాప్టర్ 1 లాంటివి క్రిస్మస్ కు వచ్చే బ్లాక్ బస్టర్లు కొట్టాయి. సో సంక్రాంతి పండగ వచ్చేదాకా పదిహేను రోజులకు పైగా స్పేస్ దొరుకుతుంది. జనవరి 10న చిరంజీవి విశ్వంభర ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 20కే గేమ్ ఛేంజర్ రిలీజయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కియారా అద్వానీ, ఎస్జె సూర్య, జయరామ్, శ్రీకాంత్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ అంచనాలు పెంచుతోంది.