గేమ్ ఛేంజర్ ముందున్న మూడు మార్గాలు

దర్శకుడు శంకర్ భారతీయుడు 2 ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ నుంచి వెంటనే కోలుకుని గేమ్ ఛేంజర్ పనులను వేగవంతం చేశారు. రామ్ చరణ్ అవసరం లేని బ్యాలన్స్ సన్నివేశాల తాలూకు చిత్రీకరణతో పాటు చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ స్పీడ్ పెంచారు. ఫైనల్ కాపీ సిద్ధమయ్యాకే రిలీజ్ డేట్ గురించి మాట్లాడతానని చెప్పిన శంకర్ నిర్మాత దిల్ రాజుకు సైతం ఎలాంటి తేదీ చెప్పలేదని సమాచారం. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ముందో డేట్ అనుకుంటే దానికి అనుగుణంగా ప్రమోషన్లు సిద్ధం చేయాలి కానీ ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకోవడం అవసరం. ఇప్పుడు మూడు మార్గాలు ముందున్నాయి.

అక్టోబర్ లో ఛాన్స్ లేదు కాబట్టి చేతిలో ఉన్నది డిసెంబర్ ఒకటే. ఒకవేళ బయట ప్రచారం జరుగుతున్నట్టు పుష్ప 2 ది రూల్ కనక మళ్ళీ వాయిదా పడే పక్షంలో గేమ్ ఛేంజర్ ఆ అవకాశాన్ని వాడుకుని 6న వచ్చేయాలి. బన్నీ కోసం లాక్ చేసుకున్న థియేటర్లన్నీ చరణ్ కు వచ్చేస్తాయి. లేదూ సుకుమార్ టీమ్ చెబుతున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 పోస్ట్ పోన్ లేదూ అనుకుంటే గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 బరిలో దిగడం మంచి ఆప్షన్ అవుతుంది. అప్పుడు నాగ చైతన్య తండేల్ తప్పుకుని నితిన్ రాబిన్ హుడ్ అంతకన్నా ముందే వచ్చే ఆలోచన చేస్తుంది. కానీ ఇదంత సులభంగా తేలే వ్యవహారం కాదు.

ఇంకోవైపు 2024 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ ని దింపే ఛాన్స్ సున్నానే. ఎందుకంటే ఆల్రెడీ వెంకటేష్ అనిల్ రావిపూడి ఆ సీజన్ లక్ష్యంగా పక్కా ప్లానింగ్ తో ఉంది. పైగా ఇదీ దిల్ రాజు సినిమానే. ఇంకోవైపు జనవరి 10 మీద కర్చీఫ్ వేసిన విశ్వంభరలో ఎలాంటి జాప్యం లేకుండా దర్శకుడు వశిష్ట ప్రతిదీ ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తున్నాడు. రవితేజ-భాను భోగవరపు కాంబో మూవీని సితార సంస్థ సంక్రాంతికే అనౌన్స్ చేసింది. సో గేమ్ ఛేంజర్ వస్తే డిసెంబర్ లో రావాలి లేదా మూడో మార్గంగా మార్చికి వెళ్ళాలి. రంగస్థలం లాగా వేసవిని వాడుకుని కలెక్షన్లు రాబట్టొచ్చు. ఈ సస్పెన్స్ ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.