మోక్షజ్ఞ దర్శకుడు ఫిక్సయినట్లేనా?

తెలుగు ప్రేక్షకులు గత రెండు దశాబ్దాల్లో ఎందరో వారసుల అరంగేట్రాలు చూశారు. కానీ ఒక కుర్రాడి అరంగేట్రం మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఆ కుర్రాడే.. నందమూరి మోక్షజ్ఞ. నందమూరి బాలకృష్ణ తనయుడైన మోక్షజ్ఞ ఆరేడేళ్ల కిందటే హీరోగా పరిచయం కావాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది.

ఒక దశలో మోక్షజ్ఞకు సినిమాల మీద ఆసక్తే లేదని.. అతను తెరంగేట్రం చేయకపోవచ్చని వార్తలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో తన అవతారం చూస్తే ఆ ప్రచారం నిజమే అనిపించింది. కానీ ఈ మధ్య మోక్షజ్ఞలో చాల ా మార్పు వచ్చింది. తన లుక్స్ పూర్తిగా మార్చుకున్నాడు. సినిమా వాళ్లతో కలిసి కనిపిస్తున్నాడు. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ చూస్తే.. అతడి అరంగేట్రం అతి సమీపంలోనే ఉందని నందమూరి అభిమానులకు అర్థమైపోయింది.

మోక్షజ్ఞ అరంగేట్రం కోసం రకరకాల ఆప్షన్లు పరిశీలించిన బాలకృష్ణ.. చివరికి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఫిక్సయ్యాడన్నది లేటెస్ట్ న్యూస్. మధ్యలో అనిల్ రావిపూడి పేరు కూడా వినిపించింది కానీ.. అతను వెంకటేష్ మూవీని మొదలుపెట్టడంతో రేసు నుంచి తప్పుకున్నట్లే అయింది.

‘జై హనుమాన్’ కంటే ముందు రణ్వీర్ సింగ్‌తో సినిమా చేయాల్సిన ప్రశాంత్.. అది క్యాన్సిల్ కావడంతో కొంచెం ఖాళీ అయ్యాడు. ఈ టైంలోనే బాలయ్యకు, అతడికి మధ్య సంప్రదింపులు జరగడం.. మోక్షజ్ఞ అరంగేట్ర చిత్రానికి దర్శకత్వం వహించడానికి అతను అంగీకరించడం జరిగిపోయాయని.. సొంత బేనర్లోనే ఈ సినిమాను బాలయ్య ప్రొడ్యూస్ చేయబోతున్నాడని.. ఆయన చిన్న కూతురు తేజస్విని ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించబోతోందని ఇండస్ట్రీ జనాల టాక్. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన రావచ్చంటున్నారు.