బిగ్ బాస్ 8 రాబోయే సెలబ్రిటీలు ఎవరు

తెలుగు రియాలిటీ షోలలో ఒక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన బిగ్ బాస్ షో ఇప్పటిదాకా ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని తర్వాత నాగార్జున బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఆయనే అయిదు సిరీస్ లు నడిపించారు. ఇప్పుడు ఎనిమిదోది రానుంది. నాగ్ కొనసాగుతారని లేదా బాలయ్యని అడిగే అవకాశాలున్నాయని టాక్ వచ్చింది కానీ అవెంత వరకు నిజమో తెలియాలంటే ఇంకో వారం పది రోజులు ఆగాలి. ఈలోగా పార్టిసిపెంట్స్ జాబితా సిద్ధం చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నట్టు సమాచారం. చూచాయగా వాళ్ళ పేర్లు కూడా బయటికి వచ్చాయి.

వెయ్యి రూపాయల బిర్యానీ బిల్లుతో సీఎం రేంజ్ లో వైరలైన కుమారి ఆంటీ, తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా సెలబ్రిటీల జాతకాలతో పాపులరైన వేణు స్వామి, జబర్దస్త్ ఆర్టిస్టు నుంచి చేపల పులుసు బిజినెస్ లోకి మారి ఆ తర్వాత రాజకీయ ప్రచారకర్తగా మారిన కిరాక్ ఆర్పి, చిన్న వీడియోతో ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసే దాకా వెళ్లిన బర్రెలక్క, టీవీ ఆర్టిస్టులు తేజస్విని, అక్షిత, హారిక, సాయికిరణ్ తదితరులు ఇందులో ఉన్నారట. స్టాండప్ కమెడియన్ శ్యామా హరిణితో పాటు సోషల్ మీడియా ఫేమ్ కుష్తిత కల్లపులు ఎంపికైనట్టు సమాచారం. సురేఖావాణి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆమె కూడా తోడవుతారు.

స్టార్ కలరింగ్ కోసం రాజ్ తరుణ్ ని సంప్రదించారట కానీ ఇప్పుడున్న కేసు ఇబ్బందులు, తిరగబడరా సామీ ప్రమోషన్ల కారణంగా హాజరు కాకపోవచ్చు. ప్రతిసారి ఫైనల్ ఎపిసోడ్ వచ్చేలోగా ఏదో ఒక వివాదంతో నడుస్తున్న బిగ్ బాస్ లో ఈసారి మరింత బలమైన గేమ్స్ ని డిజైన్క్ చేస్తున్నారట. పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన రచ్చని దృష్టిలో పెట్టుకుని ఈసారి కొన్ని కీలక మార్పులు జరగొచ్చని అంటున్నారు. సెప్టెంబర్ నుంచి షో మొదలుపెట్టే ఆలోచన జరుగుతోంది. రియాలిటీ షోల ట్రెండ్ తగ్గుతున్న టైంలో బిగ్ బాస్ 8 తిరిగి కొత్త వైభవం తెస్తుందేమో చూడాలి.