సిద్దార్థ్.. ఇంకో తేనె తుట్టెను కదిపాడు

తమిళ సీనియర్ హీరో సిద్దార్థ్ సినిమాల్లో చాలా వరకు కూల్ క్యారెక్టర్లలో కనిపిస్తాడు కానీ.. బయట మాత్రం అతనో ఆటంబాంబు లాగే ఉంటాడు. వేదికల మీద, బయట ఇంటర్వ్యూల్లో అతడి వ్యాఖ్యలు తరచుగా చర్చనీయాంశం అవుతుంటాయి. వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. గతంలో చాలాసార్లు ఇలాగే వివాదాల్లో చిక్కుకున్నాడు సిద్ధు.

ఇప్పుడు ‘ఇండియన్-2’ ప్రమోషన్లలో భాగంగా అతను ఒక ప్రముఖ క్రిటిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఇప్పటి క్రికెట్ అభిమానులను తక్కువ చేసేలా అతను మాట్లాడడమే అందుక్కారణం. ఈ తరం క్రికెట్ ఫ్యాన్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్ అంటే ఎవ్వరో తెలియదని.. ఒక తరానికి ముందు అతను గ్రేటెస్ట్ టెస్ట్ క్రికెటర్ అని.. తన పేరు కూడా తెలియని ఈ తరం అభిమానులు టీ20 మత్తులో మునిగిపోయి ఉన్నారని.. అది అసలు క్రికెట్టే కాదు ఎంటర్టైన్మెంట్ అని.. ఇప్పుడు టీ20ల్లో సిక్సర్ బాదే వాడే పెద్ద దేశభక్తుడు అని సిద్ధు ఈ ఇంటర్వ్యూలో ఆవేశంగా మాట్లాడాడు.

ఐతే ఎవరికి ఏది నచ్చాలో ఎవరు నిర్ణయిస్తారంటూ సిద్ధు మీద నెటిజన్లు ఎదురు దాడి చేస్తున్నారు. కాలానికి తగ్గట్లు క్రికెట్ కూడా మారుతోందని.. ఎవరికి నచ్చింది వాళ్లు చూస్తారని.. ఎవరిని అభిమానించాలన్నది కూడా వారి అభిమతమని.. ఇందులో ఎవరు ఎవరిని ఫోర్స్ చేయగలరు అని సిద్ధును ప్రశ్నిస్తున్నారు.

టెస్టులు ఆడితే, అందులో రాణిస్తే మాత్రం దేశభక్తి ఉన్నట్లా.. అలాంటి వాళ్లనే అభిమానించాలని రూల్ ఉందా.. సిద్ధు లాంటి వాళ్లు లక్ష్మణ్ పట్ల తమ అభిమానాన్ని చాటవచ్చు, లేదా టెస్టులకు, టెస్టు హీరోలకు ఆదరణ తగ్గిపోయిందని బాధ పడవచ్చు కానీ.. అభిమానులను నిందించేలా మాట్లాడ్డం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే.. సిద్ధు కుర్రాడిగా ఉండగా అతను ఇచ్చిన ఓ స్పీచ్‌ను తెచ్చి నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.

ఆ వీడియోలో తనకు, తన బ్యాచ్‌కు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది కాదని, తాము రెబల్స్ అని.. కబడ్డీకి సపోర్ట్ చేశామని పేర్కొన్నాడు. అప్పుడలా వ్యాఖ్యానించి ఇప్పుడు టెస్టు క్రికెట్‌, లక్ష్మణ్ గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ టీ20లు, అందులో ఆడే క్రికెటర్లు.. దాన్ని అభిమానించే ఫ్యాన్స్ మీద ద్వేషాన్నిచూపించడం ఎంత వరకు కరెక్ట్ అని సిద్ధును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.