ఐశ్వర్య…మీనాక్షి…మధ్యలో వెంకీ

ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం 1996లో వెంకటేష్ చేసిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రత్యేక జ్ఞాపకం. కమర్షియల్ జానర్ రాజ్యమేలుతున్న టైంలో ఇద్దరు భార్యల కాన్సెప్ట్ తో దర్శకుడు ఇవివి సత్యనారాయణ వడ్డించిన ఈ వినోదాల విందుని అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించారు. ఫైట్లు, ఐటెం సాంగులు లేకపోయినా వంద రోజులకు పైగానే ఆడించి బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత వెంకీ డ్యూయల్ హీరోయిన్ చిత్రాలు చేసినప్పటికీ దీనికొచ్చిన రిపీట్ వేల్యూ దేనికీ దక్కలేదన్నది వాస్తవం. ఇప్పుడీ టాపిక్ ఎందుకంటారా.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందనున్న కొత్త సినిమా రేపు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ చాలా విభిన్నమైన పాత్రను చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రీ లుక్ పోస్టర్ లో హింట్ ఇచ్చారు. మరో అప్డేట్ ఏంటంటే భార్యగా ఐశ్యర్య రాజేష్, మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపిస్తారట. ఈ ముగ్గురి మధ్య కనెక్షన్ తో పాటు ఊహించని ఒక యాక్షన్ క్రైమ్ ఎలిమెంట్ అనిల్ రావిపూడి జొప్పించినట్టు ఇన్ సైడ్ టాక్. ఇతనితో వెంకీ కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 ఏ రేంజ్ లో అలరించాయో వసూళ్ల సాక్షిగా చూశాంగా.

మొత్తానికి వెంకటేష్ టైమింగ్ ని రావిపూడి మరోసారి పిండుకోవడం ఖాయమే. 2025 సంక్రాంతి విడుదల లక్ష్యంగా పెట్టుకుని దానికి అనుగుణంగానే చేయబోతున్నారు. సరిలేరు నీకెవ్వరుని ఆరు నెలల్లో తీసిన అనిల్ రావిపూడి ప్లానింగ్ విషయంలో పక్కాగా ఉంటాడు. భగవంత్ కేసరిని సైతం ఇలాగే హ్యాండిల్ చేసి దసరా బరిలో దింపి విజయం అందుకున్నాడు. ఇప్పుడీ మూవీకీ అదే స్ట్రాటజీ ఫాలో కాబోతున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న మొదటి స్టార్ హీరో మూవీ ఇది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా క్రేజీ అప్డేట్స్ ఉంటాయని టీమ్ అంటోంది.