రాజమౌళికి, మిగతా వాళ్లకు అదే తేడా

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరోసారి తెలుగు సినిమా గురించి పెద్ద చర్చ నడుస్తోంది. నిన్న రిలీజైన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. ఆ మాటకొస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. దేశ విదేశాల్లో ‘కల్కి’ భారీ ఓపెనింగ్స్‌తో దుమ్ము రేపింది. ఈ సినిమా కాన్సెప్ట్, విజువల్స్ చూసి మనం చూస్తోంది ఒక ఇండియన్ మూవీయేనా అని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ ఇంత భారీ చిత్రాన్ని డీల్ చేసిన విధానాన్ని కొనియాడుతున్నారందరూ. ఇది కచ్చితంగా గొప్ప ప్రయత్నం అనడంలో సందేహం లేదు. అదే సమయంలో ‘కల్కి’ విషయంలో కొన్ని అసంతృప్తులు కూడా తప్పట్లేదు.

మైథాలజీ కాన్సెప్ట్‌ను బాగా తీసినా.. విజువల్స్ ఆద్యంతంగా గొప్పగా ఉన్నా.. ఓవరాల్‌గా కథను అంత పకడ్బందీగా చెప్పలేదని.. హీరో, విలన్ల పాత్రలను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని.. డ్రామా సరిగా పండలేదని.. ఎమోషనల్ కనెక్ట్ మిస్సయిందని కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో అందరూ రాజమౌళిని గుర్తు చేసుకుంటున్నారు.

రాజమౌళి ఏ కథను ఎంచుకున్నా.. అందులో బేసిక్ ఎమోషన్‌ను ప్రేక్షకుల్లోకి బలంగా ఎక్కిస్తాడు. హీరో ఏ మిషన్ చేపట్టినా.. అది ప్రేక్షకుల మిషన్‌గా మారుతుంది. అంతలా దాన్ని ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. అలాగే విలన్ పాత్ర క్రూరత్వాన్ని బలంగా చూపించి ప్రేక్షకులకు ఆ పాత్ర మీద కసి పెరిగేలా చేస్తాడు. ఈ ప్రాథమిక సూత్రాలను జక్కన్న ప్రతి సినిమాలోనూ తప్పకుండా పాటిస్తాడు. అలాగే కథను చెప్పడంలో ఎంతమాత్రం గందరగోళం ఉండదు. కింది స్థాయి ప్రేక్షకుడికి కూడా కథ క్లియర్‌గా అర్థమవుతుంది. చిన్న కాంప్లికేషన్ కూడా ఉండదు.

రాజమౌళి యాక్షన్ ఘట్టాల్లో, ఎఫెక్ట్స్ విషయంలో ఇంటలిజెన్స్ చూపిస్తాడే తప్ప.. కథను చెప్పే విషయంలో మాత్రం అరటిపండు ఒలిచిపెట్టే శైలినే అనుసరిస్తాడు. దీని వల్ల ఆయన సినిమాలు ఎక్కువ మందికి చేరువ అవుతాయి. ‘కల్కి’ సినిమా కోసం నాగి పడ్డ కష్టాన్ని, తన ప్యాషన్‌ను తక్కువ చేయలేం, అతనూ తెర మీద అద్భుతాలనే ఆవిష్కరించాడు కానీ.. రాజమౌళిలా మాత్రం కథను స్పష్టంగా చెప్పలేకపోయాడు, ఆయనలా ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచలేకపోయాడు, డ్రామాను పండించలేకపోయాడు అన్నది మాత్రం వాస్తవం. నాగి అనే కాదు.. ఇలాంటి భారీ ప్రయత్నాలు చేసిన చాలామంది దర్శకులకు, రాజమౌళికి ఉన్న తేడా ఇదే.