నిర్మాతలతో పవన్ సమావేశం ఎందుకంటే

టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలుసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందని అభిమానులు తెగ ఆలోచించారు. మీడియా సైతం ఖచ్చితమైన విషయాన్ని అంచనా వేయలేకపోయింది. దీనికి సమావేశం అయ్యాక అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఇండస్ట్రీ తరఫున ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎంలకు ఘనంగా ఇక్కడే సన్మానం చేయబోతున్నామని, తమ కౌన్సిల్ తో పాటు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని, అప్పోయింట్మెంట్ అడగాలని వచ్చామని చెప్పారు. డేట్ తదితరాలు ఇంకా ఖరారు కాలేదట.

కుశల సమాచారాలు కాకుండా వేడుకకు సంబంధించిన డేట్ల కోసమే వచ్చినట్టు అరవింద్ చెప్పడంతో డౌట్లు తీరిపోయాయి. పరిశ్రమ సమస్యలు చర్చకు రాలేదని అన్నారు. టికెట్ రేట్ల పెంపు చాలా చిన్న అంశమని దాని గురించి ప్రస్తావన తేలేదని చెప్పారు. అశ్వినిదత్, అల్లు అరవింద్, రాధాకృష్ణ, దిల్ రాజు, ఏఎం రత్నం, భోగవల్లి ప్రసాద్, బన్నీ వాస్, ఎన్వి ప్రసాద్, యార్లగడ్డ సుప్రియ, డివివి దానయ్య, మైత్రి నవీన్, టిజి విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు మీటింగ్ లో పాల్గొన్న వాళ్లలో ఉన్నారు. కొందరు స్పెషల్ ఫ్లైట్ లో రాగా మరొకొందరు రోడ్డు మార్గం ద్వారా ఒకే సమయానికి చేరుకున్నారు.

టాలీవుడ్ తో స్నేహ పూర్వక సంబంధం కొనసాగించే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన ఆనందం పరిశ్రమలో కనిపిస్తున్న వైనం ప్రేక్షకులు గమనిస్తున్నారు. కల్కి 2898 ఏడికు ప్రత్యేక వెసులుబాట్లు ఇవ్వడం దగ్గరి నుంచే ఇది ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి అల్లు అరవింద్ చెప్పిన ఆ కార్యక్రమం ఎప్పుడు ఉంటుందనేది చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లు ఒకేరోజు అందుబాటులో ఉండటం మీద ఆధారపడి ఉంటుంది. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జనసేన పార్టీనే కావడంతో ఏవైనా విన్నపాలు వినతులు వేగంగా కార్యరూపం దాలుస్తాయి.