చరణ్ చుట్టూ తమిళ హీరోల వ్యూహం

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల వ్యవహారం భేతాళ ప్రశ్న కంటే సంక్లిష్టంగా మారిపోయింది. ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ధృడ నిశ్చయం. ఎందుకంటే సంక్రాంతికి ఆయన బ్యానర్ లోనే రూపొందే వెంకటేష్ సినిమా, యువి వాళ్ళ చిరంజీవి విశ్వంభర ఉన్నాయి కాబట్టి వాటి పోటీగా వేసేందుకు లేదు. అందుకే ఎలాగైనా సరే ముందు షూటింగ్ పూర్తి చేసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ ని మరింత వేగవంతం చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి రెండు ఆప్షన్లు చూస్తున్నారు కానీ మొదటి ప్రాధాన్యం నవంబర్ ఒకటిన వచ్చే దీపావళి పండగ మీదే ఉందని ఇన్ సైడ్ టాక్.

సరే మంచి సమయమే కదాని మురిసిపోవడానికి లేదు. ఎందుకంటే టపాసుల పండగను పలువురు తమిళ హీరోలు టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్ళలో సూర్య కంగువ మొదటిది. ఇప్పటికే బాగా లేట్ అయిన ఈ పీరియాడిక్ టైం ట్రావెల్ మూవీ మీద మాములు అంచనాలు లేవు. చిన్న టీజర్ తోనే అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లారు. అజిత్ విదముయార్చిని సైతం దివాలి లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారట. ఇవి చాలవన్నట్టు కమల్ మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న ధగ్ లైఫ్ సైతం బరిలో దిగాలని చూస్తోందట. అధికారికంగా ఏదీ ప్రకటించకపోయినా చర్చలు జరుగుతున్న మాట వాస్తవం.

వీటిలో ఏది నిజమైనా గేమ్ ఛేంజర్ కు పక్క రాష్ట్రాల్లో పోటీ పరంగా చిక్కవుతుంది.అందుకే అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ ఎవరు ముందు చేస్తారాని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇది మిస్ అయితే డిసెంబర్ మినహా వేరే మార్గం ఉండదు. అక్కడ చూస్తేనేమో మొదటి వారంని బన్నీ పుష్ప పార్ట్ 2 ది రూల్ తో ఆక్రమించుకున్నాడు. మూడో వారంలో తండేల్, రాబిన్ హుడ్ వస్తున్నాయి. ఇవి తప్పుకున్నా బాలయ్య 109 వచ్చే ఛాన్స్ కొట్టిపారేయలేం. సో వీలైనంత త్వరగా గేమ్ ఛేంజర్ తన తేదీ మీద కర్చీఫ్ వేసుకోవడం ఉత్తమం. లేదంటే కాంపిటీషన్ తో పాటు చిక్కులూ తప్పవు.