త్రివిక్రమ్ వారసుడి అరంగేట్రం

ప్రస్తుతం టాలీవుడ్ నట వర్గమంతా వారసులతోనే నిండిపోయింది. ఒకప్పుడు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో అన్ని విభాగాల నుంచి నటులు వచ్చి ఇండస్ట్రీని నింపేశారు. దర్శకుల కొడుకుల్లోనూ చాలామంది హీరోలే అయ్యారు. ఐతే ఇప్పుడు ఒక దర్శకుడి కొడుకు మాత్రం నటన వైపు వెళ్లకుండా తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు. అతనే.. రిషి.

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన త్రివిక్రమ్ ఇద్దరు కొడుకుల్లో ఒకడైన రిషి.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అలా అని అతనేమీ తండ్రి దగ్గర అసిస్టెంట్‌గా పని చేయడం లేదు. తండ్రి భాగస్వామ్యంలో నిర్మితమవుతున్న వేరే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కుదురుకోవడం విశేషం.

‘సితార ఎంటర్టైన్మెంట్స్‌’తో కలిసి త్రివిక్రమ్ సంస్థ ‘ఫార్చ్యూన్ ఫోర్’ వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు బేనర్ల భాగస్వామ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రిషి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడట. రిషి ఎలా ఉంటాడో మొన్నటిదాకా జనాలకు తెలియదు.

ఐతే తాజాగా త్రివిక్రమ్ తన కుటుంబంతో కలిసి కాలి నడకన తిరుమలకు వెళ్లాడు. ఆ సందర్భంగా ఆయన ఇద్దరు కొడుకులు మీడియా కళ్లలో పడ్డారు. రిషి మంచి లుక్స్‌తో హీరోలా కనిపించడంతో అతను నటుడిగా అరంగేట్రం చేస్తాడేమో అనుకున్నారు. కానీ రిషి మాత్రం తండ్రి బాటలో దర్శకుడు కావాలని ఆశ పడుతున్నాడు. అతను తండ్రి పేరును నిలబెట్టే స్థాయికి ఎదుగుతాడని ఆశిద్దాం.