నయనతార సమస్యే అమీర్ కొడుకుది

Aamir Khan

మొన్నటి ఏడాది నయనతార నటించిన అన్నపూరణి ఎంతటి వివాదం రేపిందో తెలిసిందే. థియేటర్ లో రిలీజైనప్పుడు అంతగా పట్టించుకోని జనాలు నెట్ ఫ్లిక్స్ ఓటిటి ద్వారా వచ్చాక దాంట్లో కంటెంట్ చూసి షాక్ తిన్నారు. బ్రాహ్మణ సంఘాలు, శాఖాహారులు భగ్గుమన్నారు. కేసుల దాకా వ్యవహారం వెళ్ళింది.

లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా ఉందని భజరంగ్ దళ్ లాంటి హిందూ సంస్థలు తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేశాయి. ఇది తట్టుకోలేక నిర్మాణ భాగస్వామి జీ స్టూడియోస్ క్షమాపణ చెప్పగా నెట్ ఫ్లిక్స్ ఏకంగా తమ లైబ్రరీ నుంచి అన్నపురణిని తీసేసింది. మళ్ళీ అప్లోడ్ చేయనే లేదు.

కట్ చేస్తే ఇప్పుడు అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ ఇదే తరహా చిక్కుల్లో పడింది. అతను నటించిన మహారాజ్ ముందు ప్రకటించిన ప్రకారం ఇవాళ జూన్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ గుజరాత్ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో రిలీజ్ ఆగిపోయింది.

ఈ మహారాజ్ 1862లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తీశారు. ఒక జర్నలిస్టుకి ఒక మత గురువుకి మధ్య చెలరేగిన వివాదం ఆధారంగా దర్శకుడు సిద్దార్థ్ పి మల్హోత్రా భారీ బడ్జెట్ తో తెరెకెక్కించారు. పుష్టి వర్గి వైష్ణవ్ పంత్ అనే స్వామిజికి సంబంధించిన శిష్యులే ఇప్పుడీ విడుదల ఆపారు.

విచారణ జూన్ 18కి వాయిదా పడింది. నిజానికి కోర్ట్ ఆర్డర్ రాకపోతే సైలెంట్ గా వదలాలని అనుకున్నారు. అందుకే ట్రైలర్ కట్ కూడా చేయలేదు. ఈలోగా న్యాయస్థానం జోక్యం వల్ల అప్పటికప్పుడు ఆపేయాల్సి వచ్చింది.

గతంలో పీకేలో అమీర్ ఖాన్ ఇదే తరహాలో తమ మనోభావాలను దెబ్బ తీసి ఇప్పుడు కొడుకుతో కూడా అలాంటి సినిమా చేయించడం ఏమిటని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహారాజ్ ను ముందు తమకు స్క్రీనింగ్ చేయాలని వాళ్ళ డిమాండ్. దర్శక నిర్మాతలు దానికి సిద్ధంగా లేరు. మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో జునైద్ తెరంగేట్రం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి.