జూనియర్ శుభాకాంక్షలు : ఊహాగానాలకు చెక్

నిన్న వెలువడిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి అమోఘ విజయం గురించి మీడియాలో, ప్రజల్లో ఎడతెరిపి లేకుండా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఊహించిన దానికన్నా చాలా గొప్పగా, ఎగ్జిట్ పోల్స్ కు సైతం అందనంత ఎత్తుగా వచ్చిన మార్పు చూసి జనమే ఆశ్చర్యపోతున్నారు. జగన్ సర్కారు పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి విషెస్ రాలేదనే అంశాన్ని క్రమంగా కొన్ని వర్గాలు వాడుకోవాలని చూశాయి.

వాటికి చెక్ పెడుతూ తారక్ ఎక్స్ వేదికగా మావయ్య చంద్రబాబునాయుడు, బాబాయ్ బాలకృష్ణ, అత్త పురందరేశ్వరి, లోకేష్. మతుకుమిల్లి భరత్ లకు శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెట్టడంతో ఊహాగానాలకు బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ కి కొనసాగింపు ట్వీట్ లో ప్రత్యేకంగా విష్ చేయడం గమనార్హం. నిజానికి టీడీపీ ప్రచార పర్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఏనాడూ పాల్గొనలేదు. రాజకీయంగా టీడీపీకి అవమానాలు ఎదురైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి వివాదాలకు దూరంగా ఉన్నాడు. దీని గురించి విమర్శలు వచ్చినా సరే తనతో పాటు అన్నయ్య కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఒకే మాట మీద కొనసాగారు.

ఇప్పుడు విజయాల్లో భాగం పంచుకోవడం బాధ్యత కాబట్టి తనవైపు నుంచి జూనియర్ మనసులో మాటలు పంచుకున్నాడు. అబ్బాయి బాబాయ్ కి ఏదో వైరం ఉందని, తెలుగుదేశం కావాలని తారక్ ని దూరం పెట్టిందనే ప్రచారాలు ఎన్ని ఉన్నా ప్రస్తుతం సినిమాలే ప్రపంచంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల గురించి ఇప్పట్లో ఆలోచన చేసే ప్రసక్తే లేదని తన సన్నహితులతో చెబుతూ వచ్చాడు. కాకపోతే చంద్రబాబు అరెస్ట్ జరిగిన సమయంగా తీవ్రంగా ఖండించలేదనే అసంతృప్తి ఒక్కటే టిడిపి వర్గాల్లో ఉండింది. ఇప్పుడంతా ఆల్ ఈజ్ వెల్ అనే చెప్పొచ్చు.