మోక్షజ్ఞ ఎంట్రీకి తొలగిన మబ్బులు

నందమూరి మూడో తరం వారసుల్లో అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్న తెరంగేట్రం మోక్షజ్ఞదే. బాలకృష్ణ లెగసిని కొనసాగించే హీరోగా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తాడాని వెయిట్ చేస్తున్నారు. సీనియర్ స్టార్లలో చిరంజీవికి రామ్ చరణ్, నాగార్జునకు నాగచైతన్య ఇలా ఒక్కొక్కరు సెటిలైపోయారు. బ్యాలన్స్ ఉన్నది బాలయ్య వైపు నుంచే. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు హరికృష్ణ అబ్బాయిలు, అందులోనూ పూర్తిగా సెటిలైపోయారు కాబట్టి మోక్షజ్ఞ కోసం డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్ మాటల్లో సహేతుకత ఉంది. నిన్న జరిగిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ వచ్చేసింది.

ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య మాట్లాడుతూ మోక్షజ్ఞ త్వరలోనే రాబోతున్నాడని, అయితే తన బిడ్డ తాతను తండ్రిని స్ఫూర్తిగా తీసుకోకుండా ఇప్పటి కుర్రకారు గ్యాంగ్ విశ్వక్ సేన్, అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డలను ఇన్స్ పిరేషన్ గా తీసుకోవాలని అనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంత వెనకాల తానున్న సరే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మెప్పించాలంటే యూత్ హీరోల్లాగా ఆలోచించాలనే కోణంలో ఈ సూచన చేసినట్టు స్పష్టం చేయడంతో మోక్షజ్ఞ రంగప్రవేశం గురించి పూర్తి క్లారిటీ వచ్చేసింది. అయితే ఎప్పుడనే ప్రశ్న ఎవరూ వేయలేదు, ఆయన ఇవ్వలేదు.

అంతర్గత సమాచారం మేరకు మోక్షజ్ఞ నటన, డాన్సు, ఫైట్లు తదితర విభాగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నాడట. వైజాగ్ సత్యానంద్ తో మొదలుపెట్టి హైదరాబాద్ లోని పలు అకాడెమీల్లో వీటికి సంబంధించిన ట్రైనింగ్ అయిపోయిందని అంటున్నారు. టెస్ట్ షూట్ చేసి అంతా ఓకే అనుకున్నాక కాంబోని సెట్ చేయబోతున్నారు. దర్శకుడు, నిర్మాత ఇవేవి ప్రస్తుతానికి ఖరారు కాలేదు. బాలయ్య స్వీయ దర్శకత్వంలో ఆదిత్య 999తో లాంచ్ చేస్తానని ఆ మధ్య అన్నారు కానీ అది ఆలస్యమయ్యేలా ఉండటంతో ఆ బాధ్యతను వేరొకరికి అప్పగించే ప్లానింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ లాంఛనం ఉండొచ్చు.