భారతీయుడిని చూసి భారతీయుడు-2కు వెళ్లొచ్చు

ఎప్పుడో పాతికేళ్ల కిందట వచ్చిన సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కడం అరుదైన విషయం. ‘90వ దశకంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనం రేపిన ‘భారతీయుడు’కు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. కమల్ హాసనే హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శంకరే రూపొందించాడు. ఈ సినిమా మొదలై నాలుగేళ్లు దాటిపోయింది. కానీ అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడి.. రెండేళ్ల విరామానంతరం తిరిగి పట్టాలెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.

ముందు జూన్‌లోనే రిలీజ్ అనుకున్నారు కానీ.. తర్వాత ఇంకో నెల రోజులు ఆలస్యంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. జులై 12న ‘భారతీయుడు’ బహు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘భారతీయుడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతుండడం విశేషం.

ఐతే ‘భారతీయుడు-2’ మేకర్స్‌కు, ‘భారతీయుడు’ రీ రిలీజ్‌కు ఏ సంబంధం లేదు. ‘భారతీయుడు-2’ చిత్రాన్ని నిర్మిస్తోంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ‘భారతీయుడు’ తీసింది సీనియర్ నిర్మాత ఏఎం రత్నం. సీక్వెల్ రిలీజ్ కాబోతున్న నెల రోజుల ముందు ఈ చిత్రాన్ని అటు తమిళంలో, ఇటు తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు రత్నం. జూన్ 7కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఓ వారం పది రోజులైనా సినిమాను నడిపించాలని చూస్తున్నారు.

‘భారతీయుడు-2’ ప్రాపర్ సీక్వెల్ కావడంతో మొదట సినిమాను ఒకసారి థియేటర్లలో దర్శించి ఆ తర్వాత సీక్వెల్‌కు వెళ్లడం ప్రేక్షకులకు బాగానే ఉంటుంది. కాకపోతే కల్ట్ మూవీ అయిన ‘భారతీయుడు’ను చూశాక పెరిగే అంచనాలను సీక్వెల్ అందుకోవడం కష్టమే. చాలా ఏళ్లుగా తన సినిమాలేవీ సరిగా ఆడక, ‘హరి హర వీరమల్లు’ ఆలస్యం కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు రత్నం. ఇటీవలే ఆయన ‘గిల్లి’ సినిమాను రీ రిలీజ్ చేస్తే మంచి ఆదాయం వచ్చింది. అలాగే ‘ఇండియన్’ రీ రిలీజ్‌తోనూ నాలుగు కాసులు వెనుకేసుకోవాలని ఆయన భావిస్తుండొచ్చు.