తెలుగులో ఢ‌మాల్.. త‌మిళంలో త‌గ్గేదేలే

ఉప్పెన సినిమాతో తెలుగులో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క‌థానాయిక కృతి శెట్టి. తొలి చిత్రంతోనే వంద కోట్ల క్ల‌బ్బులో అడుగు పెట్టిన కృతికి రెండో చిత్రం శ్యామ్ సింగ‌రాయ్ కూడా మంచి విజ‌యాన్నే అందించింది. కానీ ఆ త‌ర్వాత ఆమెకు అస్స‌లు క‌లిసి రాలేదు. వ‌రుస ప‌రాజ‌యాలు వెన‌క్కి లాగేశాయి.

ది వారియ‌ర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, క‌స్ట‌డీ.. ఇలా ఆమె చివ‌రి చిత్రాల‌న్నీ నిరాశ ప‌రిచాయి. దీంతో టాలీవుడ్లో ఎంత వేగంగా పైకి వెళ్లిందో అంతే వేగంగా కిందికి వ‌చ్చేసింది.

ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నీ శ‌ర్వానంద్ స‌ర‌స‌న న‌టించిన మ‌న‌మే మీదే ఉన్నాయి. ఐతే తెలుగులో కెరీర్ డౌన్ అవుతున్న స‌మ‌యంలోనే త‌మిళంలో మంచి మంచి అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది కృతి. ఆమె చేతిలో మూడు క్రేజీ సినిమాలున్నాయి త‌మిళంలో.

ఆల్రెడీ జ‌యం ర‌వి స‌ర‌స‌న జెనీ అనే ఫాంట‌సీ మూవీలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది కృతి. దీంతో పాటు ల‌వ్ టుడే ఫేమ్ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ అనే సినిమాలోనూ న‌టిస్తోంది. ఇప్పుడు స్టార్ హీరో కార్తి స‌ర‌స‌న మంచి ఛాన్స్ ప‌ట్టేసింది కృతి.

శ‌నివారం కార్తి పుట్టిన రోజు సంద‌ర్భంగా వా వాతియార్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. సూదుక‌వ్వుం లాంటి సెన్సేష‌న‌ల్ మూవీ తీసిన న‌ల‌న్ కుమార‌స్వామి డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. ఇందులో కృతిని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. కార్తితో సినిమా అంటే పెద్ద అవ‌కాశ‌మే.

నిజానికి కార్తి కంటే ముందు అత‌డి అన్న సూర్య‌తో న‌టించాల్సింది కీర్తి. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య న‌టించాల్సిన‌ వ‌డివాస‌ల్ అనే సినిమాకు కృతినే క‌థానాయిక‌గా అనుకున్నారు. కానీ ఆ చిత్రం మొద‌లైన‌ట్లే మొద‌లై ఆగిపోయింది. అది ఎప్పుడు మ‌ళ్లీ ప‌ట్టాలెక్కుతుందో తెలియ‌దు. అన్న‌తో ఛాన్స్ మిస్స‌యినప్ప‌టికీ ఇప్పుడు త‌మ్ముడితో జోడీ క‌ట్టే అవ‌కాశం ప‌ట్టేసింది కృతి.