రక్తంతో తడిసిన ‘గోదావరి’ రాజకీయం

సరైన మాస్ సినిమా కోసం అర్రులు చాచినట్టు ఎదురు చూస్తున్న బాక్సాఫీసుకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి మీద మాములు అంచనాలు లేవు. విశ్వక్ సేన్ మొదటిసారి పక్కా పల్లెటూరి గెటప్ లోకి మారిపోగా రౌడీ ఫెలోతో ఆకట్టుకుని చల్ మోహనరంగాతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన దర్శకుడు కృష్ణ చైతన్య తిరిగి తన బలమైన సీరియస్ జానర్ కు వచ్చేశాడు. నేహా శెట్టి హీరోయిన్ కాగా అంజలి మరో ప్రధాన పాత్ర పోషించింది. ఇవాళ హైదరాబాద్ దేవి థియేటర్లో ట్రైలర్ లాంచ్ చేశారు. కథ గురించి అవగాహన వచ్చేలా రెండు నిమిషాల ఇరవై సెకండ్ల వీడియోని ఆవిష్కరించారు.

పచ్చని ప్రశాంతమైన గోదావరి ప్రాంతంలో లంకల రత్నాకర్(విశ్వక్ సేన్) ది దూకుడు మనస్తత్వం. ఎవడు అడ్డు తగిలినా కొట్టేసే రకం. రాజకీయాల్లోకి రావాలని మహా కోరికగా ఉంటుంది. అనుకోవడమే ఆలస్యం రంగంలోకి దిగుతాడు. బుజ్జి(నేహా శెట్టి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఎన్నికల్లో నిలబడి గెలుపు చూడాలని కలలు కన్న రత్నంకు కొత్త ప్రత్యర్థులు పుట్టుకొస్తారు. కత్తి పట్టుకుని నరకడం మొదలుపెట్టాల్సి వస్తుంది. ఆఖరికి కుటుంబమే ఆపదలో పడుతుంది. ఆడాళ్ళు మగాళ్లు కాకుండా మనుషుల్లో మూడో రకమే పొలిటికల్ లీడర్లని నమ్మే రత్నం చివరికి ఏం చేశాడనేది తెరమీద చూడాలి.

చాలా ఇంటెన్స్ తో దర్శకుడు కృష్ణ చైతన్య గ్యాంగ్స్ అఫ్ గోదావరిని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. అందమైన గోదావరి తీరంలో అలజడులు కూడా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశారు. విశ్వక్ సేన్ తనదైన శైలిలో చెప్పిన మాస్ డైలాగులు పేలేలా ఉన్నాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అనిత్ మదాడి ఛాయాగ్రహణం క్వాలిటీ పెంచాయి. మే 31 విడుదల కాబోతున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి విశ్వక్ సేన్ గత సినిమా గామికి పూర్తి విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో రావడం విశేషం. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ మూవీ భజే వాయు వేగం, గంగంగణేశాతో పాటు రానుంది.