కంగనా వెర్సస్ కశ్యప్.. రసవత్తర ట్వీట్ వార్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బ్యాకప్‌తో ఆమె మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన సర్కారును గట్టిగా ఢీకొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పెద్ద పెద్ద స్టేట్మెంట్లే ఇస్తోంది. అతి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న సంకేతాలు కూడా ఇస్తోందామె.

తాజాగా ఆమె తనలో దేశభక్తి కోణం గురించి చెబుతూ ఒక ఎమోషనల్ ట్వీట్ వేసింది. ‘‘నేను ఓ పోరాట యోధురాలిని. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను. దేశ గౌరవం కోసం నా స్వరాన్ని వినిపిస్తాను. ఆత్మగౌరవంతో ఓ జాతీయ వాదిగా జీవిస్తాను. విలువల విషయంలో రాజీపడను.. జైహింద్’’ అని ఆ ట్వీట్లో పేర్కొంది కంగనా. ఐతే బీజేపీ, ఆ పార్టీ మద్దతుదారులను తీవ్రంగా వ్యతిరేకించే, విమర్శించే దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ఈ ట్వీట్‌కు తనదైన శైలిలో కౌంటర్ వేశాడు.

‘‘కంగనా.. నువ్వు ఓ మణికర్ణిక. నువ్వు ఇంకో నలుగురిని తీసుకెళ్లి మన భూభాగంలోకి దూసుకు వస్తున్న చైనాపై యుద్ధం చేసి రా. మీరున్నంత వరకు ఈ దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరని వాళ్లు గుర్తించేలా చేయండి. మీ ఇంటి నుంచి కేవలం ఒక రోజు ప్రయాణం చేస్తే ఎల్ఏసీ వస్తుంది’’ అని కశ్యప్ కామెంట్ చేశాడు. ‘మణికర్ణిక’లో ఝాన్సీ లక్ష్మీబాబయి పాత్రను పోషించిన కంగనా.. తనను తాను ఝాన్సీగా చెప్పుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె తన సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తన తాజా ట్వీట్ మీద కశ్యప్ ఇలా కామెంట్ చేశాడు.

ఐతే ఇలా తనను కౌంటర్ చేసే వాళ్లను కంగనా ఊరికే ఏమీ వదిలిపెట్టదు. కశ్యప్‌కు కూడా ఘాటుగా బదులిచ్చింది. ‘‘దేశ సరిహద్దుల్లోకి వెళ్లడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు ఒలింపిక్స్‌కు వెళ్లండి. దేశం స్వర్ణ పతకాలు కోరుకుంటోంది. ఇదేం బి-గ్రేడ్ సినిమా కాదు.. ఆర్టిస్టులు ఏమైనా చేసెయ్యడానికి. మీరు ఇంత తెలివి తక్కువ మనిషిగా ఎలా అయ్యారు. మనిద్దరం స్నేహితులుగా ఉన్నప్పుడు మీరు తెలివిగానే కనిపించేవారే’’ అని ట్వీట్ చేసింది. వీళ్లిద్దరి ట్వీట్ వార్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇదెంత వరకు వెళ్తుందో అని వాళ్లు చూస్తున్నారు.