తెలుగు దర్శకుడు.. సైలెంట్‌గా బాలీవుడ్లోకి

టాలీవుడ్లో మంచి పేరు సంపాదించి ఆ తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దర్శకులు చాలామందే ఉన్నారు. ఐతే వాళ్లందరూ తెలుగులో ప్రూవ్ చేసుకున్నాకే బాలీవుడ్లో అవకాశం అందుకున్నారు. కానీ ఇప్పుడో దర్శకుడు సైలెంటుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తన పేరు.. చరణ్ తేజ్ ఉప్పలపాటి. ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించొచ్చు.

నిఖిల్ మూవీ ‘స్పై’కి అతను నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరించాడు. పోస్టర్ మీద ‘సీఈవో’గా పడింది ఈ పేరు. ఇప్పుడీ కుర్రాడు ఓ పెద్ద సినిమాతో బాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ చిత్రంలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ కాజోల్ లీడ్ రోల్ చేస్తుండడం విశేషం. ఆమెకు జోడీగా ప్రభుదేవా కూడా నటిస్తున్నాడు.

అంతే కాక ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’ ‘విరూపాక్ష’ లాంటి చిత్రాలతో తెలుగులో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త ఈ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇంకా నసీరుద్దీన్ షా లాంటి లెజెండరీ నటుడు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అట.

మెర్సల్, క్రాక్ లాంటి పెద్ద సినిమాలకు ఛాయాగ్రహణం అందించిన జీకే విష్ణు ఈ సినిమాకు కెమెరామన్‌గా పని చేస్తున్నాడు. అసలు దర్శకుడిగా తెలుగులో సినిమాలేవీ చేయని కుర్రాడికి నేరుగా బాలీవుడ్లో అవకాశం దక్కడం.. ఇలా పేరున్న నటీనటులు ముఖ్య పాత్రలు పోషించడం విశేషమే.

ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది వెల్లడి కాలేదు. బహుశా చరణ్ తేజ్ సొంతంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు. ‘స్పై’ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే నిర్మాతలే సమకూర్చుకున్నారు. అందులో చరణ్ తేజ్ కూడా భాగస్వామి. ఐతే ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. మరి బాలీవుడ్లో దర్శకుడిగా చరణ్ తేజ్ ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.