ఇప్పుడైనా జనం వస్తారా?

తెలుగు సినిమా అనే కాక దేశవ్యాప్తంగా అన్ని భాషల చిత్రాలూ కొన్ని వారాలుగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ వేసవిలో ఏ భాషలోనూ భారీ చిత్రాలు విడుదల కాకపోవడం ప్రతికూలంగా మారగా.. మరోవైపు ఎన్నికలు, ఐపీఎల్ హడావుడి పుణ్యమా అని జనం థియేటర్ల వైపు చూడ్డమే మానేశారు.

ఎప్పుడూ వేసవిలో వసూళ్ల పంట పండించుకునే టాలీవుడ్లో ఈసారి ఘోరమైన స్లంప్‌ నడిచింది. వేసవిలో ఒక్కో వారం గడిచేకొద్దీ దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం కొత్త సినిమాలే రిలీజ్ కాకపోవడం, థియేటర్లు పది రోజుల పాటు హాలిడే ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ప్రేక్షకులు థియేటర్లు రావడం బాగా తగ్గించేయడంతో పలు చిత్రాలు రిలీజ్ డేట్లను మార్చుకుని వెనక్కి వెళ్లడమూ చూశాం.

ఇలా వెనక్కి వెళ్లిన చిత్రాల్లో రెండు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవే.. దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి నటించిన లవ్ మి, కమెడియన్ గెటప్ శీను లీడ్ రోల్ చేసిన రాజు యాదవ్. ఎన్నికలు అయిపోయాయి, ఐపీఎల్ కూడా చివరి దశకు వచ్చింది. కాబట్టి పరిస్థితి మారుతుందని ఈ రెండు చిత్రాల బృందాలు ఆశాభావంతో ఉన్నాయి. కానీ ఈ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మాత్రం కంగారు తప్పట్లేదు. జనం ఇప్పటికీ సినిమాలు చూసే మూడ్‌లోకి రాలేదేమో అన్న సందేహాలు కలిగించేలా అడ్వాన్స్ బుకింగ్స్ మరీ దారుణంగా ఉన్నాయి. ‘

లవ్ మి’ సినిమా ప్రోమోలు బాగున్నా.. ఇందులో ‘బేబి’ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించినా.. పీసీ శ్రీరామ్, కీరవాణి లాంటి లెజెండరీ టెక్నీషియన్లు దీనికి వర్క్ చేసినా.. బజ్ క్రియేట్ కాలేదు. ‘రాజు యాదవ్’ కాన్సెప్ట్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నా.. ఒక కమెడియన్ హీరోగా నటించిన చిత్రంపై ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నది సినిమాలు రిలీజయ్యాక టాక్‌ను బట్టి ఏమైనా జనం థియేటర్లకు కదులుతారేమో కానీ.. ప్రస్తుతానికైతే ఈ చిత్రాలు బాక్సాఫీస్‌లో తిరిగి కళ తీసుకురావడం సందేహంగానే కనిపిస్తోంది.