మంజుమ్మల్ బాయ్స్ కు ఇళయరాజా నోటీసు

మాస్ట్రో ఇళయరాజా తన పాటల కాపీ రైట్స్ విషయంలో పరిమితికి మించి పోరాడుతున్న వైనం అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా మంజుమ్మల్ బాయ్స్ బృందానికి తన గుణ సినిమా పాటను క్లైమాక్స్ లో ఉపయోగించుకున్నందుకు గాను రాయల్టీ చెల్లించాలని లేనిపక్షంలో తీసేయాలని డిమాండ్ చేస్తూ నోటీసు పంపినట్టు వచ్చిన వార్త మరోసారి చర్చకు దారి తీస్తోంది. అయితే సదరు నిర్మాతలు ముందుగానే మ్యూజిక్ కంపెనీ నుంచి అనుమతి తీసుకుని వాడుకున్నందుకు తగిన మొత్తాన్ని చెల్లించాకే స్వేచ్ఛ తీసుకున్నారు. ఈ సాంగ్ లేనిదే అసలు మంజుమ్మల్ బాయ్స్ తీయలేరు.

పారితోషికం తీసుకుని ఒక ఆల్బమ్ ని కంపోజ్ చేసి ఇచ్చాక అది నిర్మాత, సంగీత సంస్థల సొత్తు అవుతుందనేది ప్రాధమిక సూత్రం. సృజనాత్మకతకు సంబంధించిన అంశం మాత్రం సంగీత దర్శకుడి పరిధిలో ఉంటుంది. అయినాసరే రాజాగారు పదే పదే ఈ వ్యవహారం జోలికి వెళ్లడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్పి బాలసుబ్రమణ్యం బ్రతికి ఉన్నప్పుడు ఆయన పాల్గొనే లైవ్ కన్సర్ట్స్ లో తన పాటలు వాడుకోకూడదని నోటీసు పంపితే కొంత కాలం గానగాంధర్వుడు మౌనంగా ఉన్నారు. ఇద్దరి మధ్య ఆ సంఘటన అపార్థానికి దారి తీసింది. మాసిపోవడానికి కొంత కాలం పట్టింది.

కొన్ని నెలల క్రితం ఇలాగే ఎకో, సోనీ కంపెనీలతో రైట్స్ విషయంలో వివాదం వచ్చింది. రాజాగారి పట్టుదల మెచ్చుకోదగినదే కానీ ఆయన ప్రాక్టికల్ గా ఆలోచించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు సినిమాల్లో, సీరియల్స్ లో పాటలను, బీజీఎమ్ లను వాడుకోవడం ముమ్మాటికి తప్పే. కానీ సరైన రీతిలో లీగల్ గా పర్మిషన్లు తీసుకున్నప్పుడు మాత్రం ఎవరూ ఆ హక్కును కాదనలేరు. అయినా మంజుమ్మల్ బాయ్స్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటిటిలో వచ్చేశాక కూడా ఇలా ఇష్యూలోకి రావడం అనూహ్యం. బహుశా ఇందులో రాజాగారి పంతం నెగ్గకపోవచ్చని కోలీవుడ్ టాక్.