బన్నీ ఎంత తెలివిగా చేసినా..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొక్క రోజే సమయం ఉండగా.. ఈ టైంలో ప్రముఖ రాజకీయ నాయకులతో సమానంగా సినీ హీరో అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందుక్కారణం.. అతను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాలలో ఎమ్మెల్యేగా పోట ీ చేస్తున్న శిల్పా రవికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే. ఈ అంశం నిన్న ఉదయం నుంచి హాట్ టాపిక్‌గా మారింది.

రెండు రోజుల కిందటే అల్లు అర్జున్.. తమ కుటుంబ సభ్యుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ట్వీట్ వేసి అభిమానుల మనసులు గెలిచారు. కానీ ఇంతలో ఇప్పుడు వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడంతో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఓవైపు జనసేనాని.. మెగా ఫ్యామిలీలో మిగతా వాళ్లు వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రచారంలో పాల్గొంటుంటే.. బన్నీ వెళ్లి వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బన్నీ చేసింది నిజానికి పెద్ద తప్పేమీ కాదు. తన స్టేట్మెంట్లో కూడా తాను పార్టీతో సంబంధం లేకుండా తన మిత్రుడికి ప్రచారం చేయడానికి మాత్రమే వచ్చానని బన్నీ చెప్పుకున్నాడు. పైగా బన్నీ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన రోజే.. ఆయన తండ్రి అల్లు అరవింద్ పిఠాపురానికి వెళ్లి పవన్‌కు మద్దతుగా నిలిచాడు. అంతే కాక బన్నీ ప్రచారం గురించి ఆయన పీఆర్ టీం పెట్టిన పోస్టుల్లో వైసీపీ ప్రస్తావనే లేకుండా, కేవలం అభ్యర్థి పేరు మాత్రమే ప్రస్తావించారు.

ఇలా బన్నీ తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ.. అతడి పట్ల మెగా అభిమానుల్లో, జనసైనికుల్లో అసంతృప్తి జ్వాలలు చల్లారట్లేదు. ఎన్ని లాజిక్కులు మాట్లాడినా సరే.. వైసీపీని పవన్ బద్ద శత్రువుగా భావిస్తున్న తరుణంలో ఆ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం తప్పేనని అంటున్నారు. ఆల్రెడీ మెగా అభిమానుల్లో ఒక వర్గం బన్నీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. తాజా పరిణామంతో ఆ వర్గంలో బన్నీకి కోలుకోలేని డ్యామేజ్ జరిగిందని భావిస్తున్నారు.