IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు కొత్త ఊపు రావాలని బయ్యర్లు మొక్కుకుంటున్నారు. ఒకపక్క మండిపోయే ఎండలు కారణంగా కనిపిస్తున్నా మెప్పించే కంటెంట్ లేనివి రావడం వల్లే వసూళ్లు లేవనే కామెంట్ ని ఎంత మాత్రం కొట్టిపారేయలేం. వీటికి తోడు ఐపీఎల్ దెబ్బ ఈసారి మాములుగా లేదు. ముఖ్యంగా రేసులో ఎక్కువ వెనుకబడి ఉండే హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ సూపర్ ఫామ్ తెలుగు రాష్ట్రాల అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. ఇతర మ్యాచులను కూడా ఎగబడి చూస్తున్నారు.

ఈ టోర్నమెంట్ ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే నిన్న కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు, హాళ్లలోనే ఫోన్ ద్వారా లైవ్ స్కోర్స్ చూసుకోవచ్చు, దయచేసి థియేటర్లకు రమ్మని ఓపెన్ గా అడిగేశాడు. దీని గురించి సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు రావడం సహజమే కానీ సినిమా బాగుంటే ఎలాంటి ప్రతికూలతలు ఆడియన్స్ రాకుండా ఆపలేవని టిల్లు స్క్వేర్ లాంటివి నిరూపించాయి. కానీ ఏప్రిల్ మొత్తంలో ఒక్కటంటే ఒక్కటి స్ట్రెయిట్ మూవీ మెప్పించేలా లేకపోవడం ఎగ్జిబిటర్ల పాలిట శరాఘాతంగా మారింది.

ఇకపై ప్రతి సంవత్సరం ఐపీఎల్, సమ్మర్ రెండింటిని చూసుకుని మరీ రిలీజులు ప్లాన్ చేయాల్సి వచ్చేలా ఉంది. అనిల్ రావిపూడి అన్నదాంట్లో లాజిక్ ఉంది కానీ ఐపీఎల్, సినిమా రెండూ వినోదం అందించేవే. క్రికెట్ లైవ్ మిస్ అయితే మళ్ళీ చూడబుద్ది కాదు. కానీ సినిమా అలా కాదు. ఏ షోకు వెళ్లినా అనుభూతిలో మార్పు ఉండదుగా అనేది కొందరి వాదన. నిజానికి అనిల్ ఉద్దేశం అది కాదు. ఎండలకు మార్నింగ్, మ్యాట్నీలకు ఎలాగూ రారు కాబట్టి సాయంత్రం, సెకండ్ షోలకు వస్తే బాగుంటుందని. అయినా ఒక మేకర్ గా ఆయన ఆలోచించింత లోతుగా ప్రేక్షకులు ఆలోచిస్తారా.