పవన్ నీరుగారిస్తే.. ప్రభాస్ ఛాన్సిచ్చాడు

బాలీవుడ్ భామ నిధి అగర్వాల్‌కు తెలుగులో ఇప్పటిదాకా మంచి మంచి ఛాన్సులే వచ్చాయి. కానీ ఆ ఛాన్సులు హిట్లుగా మారకపోవడంతో ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. అక్కినేని నాగచైతన్య సరసన ‘సవ్యసాచి’ లాంటి క్రేజీ మూవీతో ఆమె తెలుగులోకి అడుగు పెట్టింది. కానీ అది పెద్ద డిజాస్టర్ అయింది.

ఆ తర్వాత చైతూ తమ్ముడు అఖిల్‌కు జోడీగా ‘మిస్టర్ మజ్ను’ చేస్తే అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అశోక్ గల్లాతో ‘హీరో’ అనే మూవీ చేస్తే అది కూడా ఆడలేదు. దీంతో ఆమెపై ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. అయినా సరే.. నిధి ఓ మెగా మూవీలో అవకాశం దక్కించుకుంది. అదే.. హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ అంటే నిధి దశ తిరిగినట్లే అని అంతా అనుకున్నారు.

కానీ పాపం నిధి ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘హరిహర వీరమల్లు’ మధ్యలోనే ఆగిపోయింది. ప్రొడక్షన్ మొదలైన మూడేళ్ల తర్వాత కూడా ఈ సినిమా విడుదల కాలేదు. దాదాపు ఏడాది నుంచి షూటింగ్ హోల్డ్‌లో ఉంది. మళ్లీ ఎప్పుడు సినిమా పున:ప్రారంభం అవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో నిధికి మరో పెద్ద సినిమాలో అవకాశం దక్కడం విశేషం.

ప్రభాస్ కొత్త చిత్రం ‘రాజా సాబ్’లో నిధి ఓ ప్రత్యేక పాత్ర చేస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు ఇంకో ఇద్దరు హీరోయిన్లకు ఇందులో పాత్రలున్నాయి. అందులో ఓ పాత్రను రిద్ధి కుమార్ చేస్తోంది. మరో పాత్రకు నిధి కన్ఫమ్ అయింది. తాజాగా నిధి ‘రాజా సాబ్’ సెట్లోకి కూడా అడుగు పెట్టేసింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దాదాపు 70 శాతం షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజవుతుందని భావిస్తున్నారు.