శ్రీ విష్ణు.. కొత్త దర్శకుడు.. మూడు బేనర్లు

గత ఏడాది ‘సామజవరగమన’తో కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు శ్రీ విష్ణు. ఇటీవలే అతడి నుంచి వచ్చిన ‘ఓం భీం బుష్’ ఓ మాదిరిగా ఆడింది. ఆల్రెడీ రెండు మూడు చిత్రాలు చేతిలో ఉండగా… కొత్తగా ఇంకో సినిమాను మొదలుపెట్టాడు విష్ణు. ఉగాది రోజు ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీ విష్ణుకిది హీరోగా 19వ సినిమా. జానకి రామ్ మారెళ్ల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.

ఈ సినిమాను మూడు బేనర్లు కలిసి నిర్మిస్తుండడం విశేషం. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, విజిల్ వర్తీ ఫిలిమ్స్ అనే రెండు కొత్త సంస్థలు ఈ చిత్రంలో భాగస్వాములయ్యాయి. దీంతో పాటుగా కోన వెంకట్ సంస్థ ‘కోన వెంకట్ ఫిలిమ్ కార్పొరేషన్ కూడా ఈ చిత్రంలో పార్ట్‌నరే.

కోన వెంకట్‌తో పాటు ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కొల్లి కూడా ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. కామెడీ సినిమాలు శ్రీ విష్ణుకు బాగా కలిసొస్తున్న నేపథ్యంలో అదే జానర్లో ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. ‘సామజవరగమన’తో మంచి పేరు సంపాదించిన రచయితలు భాను భోగవరపు, నందు సవిరగన ఈ చిత్రానికి కూడా రచన అందిస్తుండడం విశేషం.

‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చనుండగా.. సాయి శ్రీరామ్ కెమెరా బాధ్యతలు చూసుకుంటాడు. శ్రీ విష్ణు ప్రస్తుతం పీపుల్స్ మీడియా బేనర్లో ‘స్వాగ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘రాజ రాజ చోర’ దర్శకుడు హాసిత్ గోలి రూపొందిస్తున్న చిత్రమిది. ఇది కాక రెండు ప్రాజెక్టులు అతడి చేతిలో ఉన్నాయి.