సిద్దు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే

విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు లేని ఒక మీడియం బడ్జెట్ సీక్వెల్ కోసం రెండేళ్లు వెచ్చించడం చిన్న విషయం కాదు. అయినా సరే టిల్లు స్క్వేర్ వల్ల ఈ రిస్కుకి సిద్ధపడ్డాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. రేపు విడుదల కాబోతున్న ఈ క్రేజీ ఎంటర్ టైనర్ కు నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రమోషన్లలో చాలా యాక్టివ్ గా ఉన్న అనుపమ పరమేశ్వరన్ వేడుకకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొన్న రిలీజైన పోస్టర్ లో తనకు సిద్దుకు మధ్య ఉన్న స్టిల్ మీద సోషల్ మీడియాలో కొందరు నెగటివ్ కామెంట్స్ చేయడం వల్ల మనస్థాపం చెంది రాలేదని సిద్దు చెప్పాడు.

ఎవరికి నీతులు, క్లాసులు చెప్పే హక్కు తనకు లేకపోయినా ఒక అమ్మాయిని లక్ష్యంగా చేసుకుని చేతిలో ఇంటర్ నెట్ కనెక్షన్ ఉండగానే ఏదిబడితే అది అనేయడం సభ్యత కాదని, హద్దుల్లో ఉంటూనే మహిళలకు గౌరవడం ఇవ్వాలని సభా వేదికగా విన్నవించుకున్నాడు. సినిమా సక్సెస్ అయ్యాక మళ్ళీ అనుపమని తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చాడు. సిద్దు చెప్పింది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. ఒరిజినల్ మొహాలు తెలియకుండా ఫేక్ ఐడిలు పెట్టుకుని సెలబ్రిటీల మీద కామెంట్ల రూపంలో బురద జల్లే బ్యాచులు ఆన్ లైన్ లో విపరీతంగా పెరిగిపోతున్నాయి.

వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా కొందరు అంత ఈజీగా వీటిని వదిలేయరు. సూపర్ స్టార్లతో మొదలుపెట్టి పైకొస్తున్న హీరోయిన్ల దాకా పలు సందర్భాల్లో ట్రోల్స్ కి బాధితులుగా మారిన ఉదంతాలున్నాయి. అయినా సినిమా చూడకుండా కేవలం పోస్టర్ తో అనుపమని ఇంత టార్గెట్ చేయడం అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అంశమే . మనం అమ్మాయిని ఫ్లర్ట్ చేసినా అది ఎంజాయ్ చేసేలా సంతోష పడేలా ఉండాలి తప్పించి ఇలా బాధపడేలా కాదని సిద్దు జొన్నలగడ్డ రిక్వెస్ట్ చేయడం ఎంతో కొంత మార్పు తేవాల్సిన ఇష్యూనే. టెక్నాలజీ వల్ల వచ్చిన ముప్పుల్లో ఇదీ ఒకటి.