బ‌రువు త‌గ్గింద‌ని కీర్తిని తీసేశార‌ట‌


సౌత్ హీరోయిన్లు చాలామంది బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. వాళ్లకు అక్కడ పెద్దగా కలిసొచ్చింది లేదు. ఐతే కీర్తి సురేష్ కొన్నేళ్ల కిందట ఓ భారీ చిత్రానికి సైన్ చేసి.. బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అదే.. మైదాన్. అజయ్ దేవగణ్ లాంటి అగ్ర కథానాయకుడితో ‘బదాయి హో’ దర్శకుడు అమిత్ శర్మ రూపొందిస్తున్న సినిమా కావడంతో కీర్తికి ఇది బంపరాఫరే అనుకున్నారు.

ఐతే సినిమా మొదలైనపుడు కీర్తిని కథానాయికగా ప్రకటించిన చిత్ర బృందం.. కొన్నాళ్లకు ఆమె స్థానంలోకి ప్రియమణిని తీసుకొచ్చింది. అప్పట్లో ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం చెప్పిందే తప్ప కారణమేంటో వెల్లడించలేదు కీర్తి. చిత్ర బృందం కూడా దీని గురించి ఏమీ మాట్లాడలేదు. ఐతే ఏప్రిల్ 10న మైదాన్ విడుదల కానున్న నేపథ్యంలో మీడియాను కలిసిన దర్శకుడు అమిత్ శర్మ.. కీర్తిని తప్పించడం వెనుక అసలు కారణం చెప్పాడు.

ఇందులో హీరో భార్య పాత్రకు తాను ఒక రూపాన్ని ఊహించుకున్నానని.. అప్పుడు కీర్తి సరిపోతుందని అనిపించిందని.. కానీ ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగిందని.. ఈ లోపు కీర్తి బాగా బరువు తగ్గి లుక్ మార్చుకుందని.. కొత్త లుక్‌ ఆ పాత్రకు సూటవ్వదని భావించి ఆమె స్థానంలోకి ప్రియమణిని తీసుకున్నట్లు వెల్లడించాడు. కీర్తి కెరీర్ ఆరంభంలో ఎంత బొద్దుగా ఉండేదో తెలిసిందే. కానీ తర్వాత ఉన్నట్లుండి బాాగా బరువు తగ్గి బక్కచిక్కిన లుక్‌లోకి మారింది.

హీరోయిన్లు బరువు పెరగడం వల్ల సినిమాలు కోల్పోవడం చూస్తుంటాం కానీ.. ఇలా బరువు తగ్గి నాజూగ్గా తయారవడం వల్ల ఓ పెద్ద సినిమా ఛాన్స్ కోల్పోవడం అరుదైన విషయమే. ‘మైదాన్’ మూవీని నాలుగేళ్ల కిందట మొదలుపెడితే రకరకాల కారణాల వల్ల మేకింగ్ ఆలస్యమై.. ఎట్టకేలకు విడుదల కాబోతోంది. స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా.. హైదరాబాద్‌ లెజెండరీ ఫుట్‌బాలర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కడం విశేషం.