‘కీడా కోలా’ గొడవ సద్దుమణిగింది

తెలుగు యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు తరుణ్ భాస్కర్. నటుడిగా కూడా అతడికి మంచి గుర్తింపే ఉంది. ఐతే తరుణ్ తన అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లుగా వేగంగా సినిమాలు చేయట్లేదు. దాదాపు పదేళ్ల కెరీర్లో అతను తీసింది మూడు చిత్రాలే. చివరగా చాలా గ్యాప్ తీసుకుని తరుణ్ తీసిన ‘కీడా కోలా’ అంచనాలను అందుకోలేకపోయింది.

నటుడిగా బలమైన ముద్ర వేసిన తరుణ్.. దర్శకుడిగా అంతగా మెప్పించలేకపోయాడు. ఈ సినిమా ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత టీంను ఓ వివాదం వెంటాడింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఈ సినిమాలో దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌తో ఒక పాట చేశారు. దీని మీద బాలు తనయుడు ఎస్పీ చరణ్ హర్టయ్యారు.

తరుణ్ భాస్కర్ అండ్ టీం తమను సంప్రదించకుండా ఇలా చేయడాన్ని తప్పుబడుతూ ఆయన లీగల్ యాక్షన్‌కు రెడీ అయ్యారు. కోటి రూపాయల నష్ట పరిహారం కూడా డిమాండ్ చేశారు. తరుణ్ అండ్ కో చేసింది తప్పే అయినా చరణ్ మరీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఐతే ఈ వివాదం ఇప్పుడు సద్దుమణిగింది.

తరుణ్.. చరణ్‌తో టచ్‌లోకి వెళ్లి వ్యవహారాన్ని సెటిల్ చేశారు. ఏఐ ద్వారా బాలు పాటను క్రియేట్ చేసిన విషయంలో తమకు, చరణ్‌కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని తరుణ్ తెలిపాడు.ఏఐ ద్వారా తాము కాకున్నా ఇలాంటి ప్రయత్నం వేరే వాళ్లు కూడా చేస్తారని.. దాన్ని నివారించలేమని తరుణ్ చెప్పాడు. ఐతే చరణ్‌తో మాట్లాడి ఈ విషయాన్ని సెటిల్ చేసినట్లు తరుణ్ తెలిపాడు. దీంతో ఈ గొడవ సుఖాంతం అయినట్లే.