బాక్సాఫీసుని టెన్షన్ పెడుతున్న ఎన్నికల జ్వరం

ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జనాల్లో ఎలక్షన్ ఫీవర్ మొదలైపోయింది. తెలంగాణలో జరిగినప్పుడు ఈ స్థాయి హీట్ కనిపించని మాట వాస్తవం. వార్ వన్ సైడని ముందే డిసైడవ్వడంతో విపరీతమైన ఆసక్తి కనిపించలేదు. కానీ ఏపీ కేసు వేరు. అధికార వైసిపి, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ మధ్య యుద్ధం రసవత్తరంగా జరిగేలా ఉంది. టికెట్ల ప్రకటనతో మొదలుపెట్టి ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇటీవలే చనిపోయిన గీతాంజలి అనే వివాహిత మరణం విషయంలో ఎంత రచ్చ జరుగుతోందో చూస్తున్నాం. పరస్పర ఆరోపణలు ఘాటుగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వీటి ప్రభావం బాక్సాఫీస్ మీద పడుతోంది. ఫిబ్రవరి నుంచి థియేటర్ల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఊరిపేరు భైరవకోన, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటివి ఏదో కాస్త ఊరట కలిగించాయి కానీ ఇంకా పూర్తి స్థాయిలో పికప్ ఇవ్వలేకపోయాయి. మొదటి మూడు రోజులు స్పీడ్ చూపించిన గామి ఒక్కసారిగా నెమ్మదించింది. ప్రేమలు ఊపందుకుంటున్నా మరీ భారీగా అయితే కాదు. ఈ వారం తొమ్మిది దాకా సినిమాలు వస్తున్నా వేటి మీదా మొదటి రోజే చూడాలన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో కలిగించలేకపోయాయి. టాక్ గొప్పగా తెచ్చుకుంటే తప్ప నిలవడం కష్టం.

ఒక నలుగురు టీ స్టాల్ దగ్గర కలుసుకున్నా, ఫోన్ లో చాటింగ్ చేసుకున్నా, ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాలన్నా ఎక్కువ ఫోకస్ పవన్ కళ్యాణ్ సీట్ల కేటాయింపు, చంద్రబాబు ఎలక్షన్ క్యాంపైన్, జగన్ ఎత్తుగడలు ఇలా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. పత్రికలు, న్యూస్ ఛానల్స్ లో ఇవే హైలైట్ అవుతున్నాయి. పైగా ప్రచారాలు మొదలైపోవడంతో నాలుగు డబ్బులు వస్తాయని యువత ఎక్కువగా పార్టీల వెంట తిరుగుతున్నారు. సో జనాల్లో సినిమా మూడ్ రావాలంటే హనుమాన్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ బొమ్మ ఒకటి పడాలి. అప్పుడే కోరుకున్న జోష్ వచ్చి మళ్ళీ థియేటర్లు కళకళలాడతాయి.