ఓం భీమ్ బుష్…వింతగా వెరైటీగా పబ్లిసిటీ

శ్రీవిష్ణు హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ స్నేహితులుగా కీలక పాత్రలు పోషిస్తున్న ఓం భీమ్ బుష్ మార్చి 22 విడుదలకు సిద్ధమవుతోంది. హుషారుతో ఇండస్ట్రీ దృష్టిలో పడి రౌడీ బాయ్స్ కోసం దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత నుంచి పిలుపందుకున్న శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించడం ఒక విశేషమైతే భారీ చిత్రాలు మాత్రమే తలకెత్తుకునే యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కావడంతో క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఫిబ్రవరి నుంచి బాక్సాఫీస్ కొంచెం డ్రైగా ఉన్న వాస్తవాన్ని గుర్తించిన టీమ్ టైటిల్ కు తగ్గట్టే వెరైటీ పబ్లిసిటీతో ఆకట్టుకుంటోంది.

లీడ్ రోల్స్ చేసిన ముగ్గురితో వెరైటీగా వీడియోలు చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా జనాల అటెన్షన్ ని తమవైపు తిప్పుకుంటున్నారు. ముఖ్యంగా అనంత్ అంబానీకి చెందిన వంటారా జంతు శాలకు శ్రీవిష్ణు టీమ్ వెళ్లి అక్కడ పెర్ఫార్మన్స్ ఇచ్చి ముఖేష్ అంబానీతో చప్పట్లు కొట్టించుకున్నట్టుగా ఎడిట్ చేసిన క్లిప్ బాగా వైరల్ అవుతోంది. దీంతో పాటు పరీక్షల కాలం కాబట్టి పిల్లల్ని చదువుకోమని వార్నింగ్ ఇచ్చే సీన్ బాగా పేలింది. ఇలాంటివి మరికొన్ని తయారు చేయించి రోజుకొకటి వదిలేలా ప్లాన్ చేసుకున్నారు.రిలీజ్ డేట్ దాకా వీటితో హోరెత్తింబోతున్నారు.

గామి నెమ్మదించి భీమా ఫ్లాప్ వైపు అడుగులు వేయడంతో మార్చి 15 ఒకటి రెండు తప్ప మరీ చెప్పుకోదగ్గ రిలీజులు ఏమీ లేవు. అందుకే మార్చి 22 ఈ గ్యాప్ ని ఫుల్ గా వాడుకునేందుకు ఓం భీమ్ బుష్ బృందం వేసిన ప్రణాళిక ఆకట్టుకునేలా ఉంది. దెయ్యాలు, చేతబడులు కాన్సెప్ట్ తీసుకున్నా వాటిని పూర్తిగా కామెడీగా అర్థం చేసుకుని లాజిక్స్ లేకుండా కేవలం మేజిక్ చూడమని శ్రీహర్ష చెబుతున్నాడు. సామజవరగమనకు పదిరెట్లు ఎక్కువ హాస్యంతో శ్రీవిష్ణు విశ్వరూపం చూస్తారని కూడా ఊరిస్తున్నారు. గాని తర్వాత ఒకే నెలలో యువి నుంచి వస్తున్న సినిమా ఓం భీమ్ బుష్.