100 కోట్ల మూవీని దారుణంగా తిట్టేశారు

ఇటీవలే విడుదలైన మంజుమ్మెల్ బాయ్స్ రెండు వారాలు దాటడం ఆలస్యం వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించి నూటా యాభై మైలురాయి వైపు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. మాములుగా మలయాళం సినిమాలకు తక్కువ ఆదరణ ఉండే తమిళనాడులో దీని వసూళ్లు చూసి ట్రేడ్ నివ్వెరపోయారు. తెలుగు డబ్బింగ్ మార్చి 15 వస్తుందని తొలుత ప్రచారం జరిగింది కానీ ఏవో కారణాల వల్ల వాయిదా పడింది. పదకొండు మంది కుర్రాళ్లు కోడైకెనాల్ ట్రిప్ కు వెళ్తే అక్కడో అబ్బాయి గోతిలో పడ్డాక జరిగే పరిణామాలను ఆసక్తికరంగా థ్రిల్లింగ్ గా చూపించారు.

ఇప్పుడు అసలు పాయింట్ కు వద్దాం. కోలీవుడ్ ప్రముఖ రచయిత జయమోహన్ ఈ మంజుమ్మెల్ బాయ్స్ ని తీవ్రంగా విమర్శించారు. కేరళ అడవుల్లో మందు తాగిన కుర్రకారు అక్కడ బాటిల్స్ విసిరేసి చిందరవందర చేస్తారని, దీని వల్ల వందలాది ఏనుగులు, వన్య ప్రాణులు చనిపోతున్నాయని అన్నారు. ఇదేదో ఘనకార్యం లాగా ఈ సినిమాలో నటించిన గ్యాంగ్ మందు తాగి, నిషేధిత గుణ కేవ్స్ లో పడిపోతే దాన్ని గొప్ప విషయంగా చూపించిన తీరు ఏ మాత్రం బాలేదని విరుచుకుపడ్డారు. ఇలాంటివి వాటిని ప్రోత్సహించడం సరికాదని ఓ రేంజ్ లోప్రేక్షకులకు క్లాస్ పీకేశారు.

కమల్ హాసన్, శింబు, శివ కార్తికేయన్ లాంటి వాళ్ళు టీమ్ ని పిలిచి మరీ మెచ్చుకున్న ఇలాంటి బ్లాక్ బస్టర్ ని జయమోహన్ లాంటి సుప్రసిద్ధ రచయిత, స్క్రీన్ రైటర్ తిట్టడం పర్యావరణ ప్రేమికులకు సబబుగానే అనిపిస్తోంది కానీ మూవీ లవర్స్ మాత్రం ఇదెక్కడి ఓర్వలేనితనమంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. అయినా ఏదైనా సినిమా హిట్ అయితే అందులో నెగటివ్ కోణాలను వెతికి మరీ వార్తల్లోకి ఎక్కడం ఈ మధ్య ట్రెండ్ గా మారిందని అంటున్నారు. యానిమల్ టైంలో వీటిని కాచుకోవడానికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడీ బాయ్స్ కు తప్పేలా లేదు.